6, ఆగస్టు 2019, మంగళవారం

బిందువు - 2


బిందువు గురించిన చర్చలో మనం బిందువు అనేది త్రిపరిమణరహితమైనది అని తెలుసుకున్నాం ఇంతవరకు. బిందువు ప్రకృతికి ఆవలిది అని ఒక ప్రతిపాదన కూడా చేసాం.

ప్రకృతికి ఆవలిది ఐనప్పుడు మన అవగాహనకు అందదు కదా. కాబట్టి దాన్ని గురించి సిధ్దాంతపరమైన వివేచనతో మాత్రమే దాని యొక్క తత్త్వాన్ని తెలుసుకోవలసి ఉంటుంది.

పాఠశాలలో రేఖాగణితం బోధిస్తారు. ఉదాహరణకు, ABC అనే శీర్షాలు ఉన్న త్రిభుజం గీయండి అని కొన్ని కొలతలు ఇస్తారు . AB, BC, CA అనే భుజాల పొడవు అదే క్రమంలో 3,4,5 సెంటీమీటర్లు అని చెప్పి ఆ త్రిభుజాన్ని కాగితం పైన గీయమన్నారు. సరే అది గీస్తాంఇచ్చిన కొలతలు గల భుజాలు కల ఆ త్రిభుజంలో మూడు బిందువులు A, B, C అవేవి ఉన్నాయి.

ఒక భూతద్దం తీసుకొని మనం పెనిసిల్ సహాయంతో గీసిన త్రిభుజంలోని A వద్దో మరొక శీర్షం వద్దో పెట్టి చూస్తే ఆ బిందువు అని మనం అనేది తాటికాయంత ఆకారంలో కనిపిస్తుంది. ఎంత సన్నని మొన ఉన్న పెనిసిల్ ఉపయోగించినా ఎంతోకొంత స్థూలత్వంతో కాని ఆ బిందువులను సూచించగలమా?

అంటే కేవలం సిధ్ధాంతపరమైన త్రిపరిమాణరాహిత్యాన్ని అవసరార్థం కొంచెం కంటికి కనిపించే ప్రకృతిలోనికి ఎంతో కొంత స్థూలత్వంతో తెచ్చి చూపకుండా రేఖాగణితం చెప్పే రేఖలూ త్రిభుజాలూ చతుర్భుజాలూ వంటివి గీయలేం. ఇంతవరకూ స్పష్టంగానే ఉంది కదా.

రేఖాగణితంలో ఒక మాట సిధ్ధాంతంగా చెప్తారు. ఏవైనా రెండు బిందువులను నిర్వచిస్తే వాటిని కలుపుతూ ఒకే ఒక సరళరేఖ ఉంటుందనీ, అంతేకాక ఆ సరళరేఖ ఆ రెండు బిందువులనూ దాటి అనంతంగా అటూ ఇటూ కొనసాగుతూ ఉంటుందనీ ఆ సిధ్దాంతం.

ఈ సందర్భంగానే మరొక ముఖ్యవిషయం కూడా చెప్తారు. ఏ సరళరేఖ మీదనైనా ఏ రెండు బిందువుల మధ్యనైనా సరే అనంతమైన బిందువులు ఉంటాయని.

రేఖాగణితం అనే కాదు సంఖాశాస్త్రంలో కూడా ఇటువంటి విషయం ఉంది. ఏ రెండు ఇష్ట సంఖ్యల మధ్యనైనా అనంతమైన సంఖ్యలుంటాయి!

సరే దీన్నిబట్టి అనంతంగా కొనసాగిన ఒక బిందువుల శ్రేణియే ఒక సరళరేఖ అన్నది తెలుస్తున్నది. నిజానికి సరళంగా ఉండేవే కాదు వక్రంగా ఉండే వృత్తమూ దీర్థవ్త్తత్తమూ పరావలయమూ వంటి ఏ రేఖ ఐనా సరే అది అనంతంగా ఒక పధ్ధతి ప్రకారం అమరిన బిందువుల శ్రేణి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.

ఏదన్నా రేఖలో ఉన్నవి అనంతంగా ఉన్న బిందువులు అని తెలుసుకున్నాక ఒక ప్రశ్న వస్తుంది. ఆ బిందువుల మధ్యన బేధం ఉన్నదా? అంటే ఆ రేఖలో ఒకచోట ఉన్న బిందువు మరొక చోట ఉన్న మరొక బిందువుకన్నా భిన్నమైనదా?

రేఖ అనేది స్థూలత్వం కలది. మనకు కనుపిస్తున్నది కాబట్టి. కాని దానిలో ఉన్న బిందువుల్లో ఏదీ స్థూలత్వం కలది కాదు! ఒక బిందువుయొక్క తత్త్వమూ మరొక బిందువు యొక్క తత్త్వమూ వేరు వేరు కావు.

త్రిపరిమాణరహితమైన బిందువు తనను తాను అనంతంగా చేసుకొని రేఖారూపంగా విస్తరించటం వలన ఒక స్థూలమైన అంటే దృశ్యమానమైన రూపం వచ్చి అది ప్రకృతిలో ప్రత్యక్షం ఐనది.

రేఖాగణితంలో ద్విపరిమాణ గణితమూ త్రిపరిమాణ గణితమూ అని ఉన్నాయి. ద్విపరిమాణ గణితంతో వివిధరకాల రేఖారూపాలు సిధ్ధిస్తాయి. త్రిపరిమాణ గణితంతో ఎత్తు అనే మూడవపరిమాణం కూడా జోడించటం జరుగుతుంది.

ఉదాహరణకు ద్విపరిమాణ గణితంతో వృత్తాలను నిర్వచించ వచ్చును. గీయవచ్చును. త్రిపరిమాణ గణితంతో వృత్తానికి మూడవ పరిమాణం జోడించగానే మనకు గోళాకృతికి నిర్వచనాలూ నిర్మాణాలూ సిధ్ధిస్తాయి.

అంటే ద్విపరిమాణగణితం రేఖలనూ (యంత్రాల)నూ, త్రిపరిమాణ గణితం విగ్రహాలనూ స్థూలప్రపంచానికి నిర్వచన పూర్వకంగా చెప్తున్నది.

ఐతే  ద్విపరిమాణం ఐనా త్రిపరిమాణం ఐనా సరే వెనుక నున్న ఆధారం మాత్రం త్రిపరిమాణ రహితమైన బిందువు!

బిందువు - 1


కామేశ్వరీ కామేశ్వరులను గురించిన వివరణ ఒకటి వ్రాయటం చాలా అవసరంగా అనిపిస్తోంది. ఈ విషయం లోనికి ప్రవేశించే ముందుగా మనం బిందువు అనే దాని గురించి తగినంత విచారణ చేయవలసి ఉంది.

శ్రీవిద్య అమ్మను గురించి వివరించే విద్య అని మనకు తెలుసును. ఈ శ్రీవిద్య యొక్క యంత్రరూపం శ్రీచక్రం అన్నది మొదట గ్రహించవలసిన విషయం.

ఈ శ్రీచక్రం అనేది బిందువు యొక్క వికసన స్వరూపం.

కాబట్టి ముందుగా ఈ బిందువు యొక్క తత్త్వాన్ని చక్కగా విచారణ చేదాం.

లౌకిక జగత్తును మనం ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి నామరూపాత్మక మైనది. అంటే ఈ జగత్తులో ఉన్నది యేదైనా సరే దానికి ఒక రూపమూ ఒక నామమూ అన్నవి తప్పకుండా ఉంటాయి. తిరగేసి చెప్పాలంటే నామరూపాలు ఉన్నది యేదైనా సరే అది ప్రకృతిలో ఒక భాగమే కాని దానికి అన్యమో ఆవల ఉన్నదో కానే కాదు.

ప్రకృతి సంగతి ఆనక చూదాం. అసలు ఈ నామరూపాలను గురించి కొంచెం ఆలోచిద్దాం.

మనకు పేర్లున్నాయి. సుబ్బారావు అనగానే ఒకడు గుర్తుకు వస్తాడు. అప్పారావు అనగానే మరొకడు గుర్తుకు వస్తాడు కాని సుబ్బారావు మాత్రం స్ఫురించడు. ఎందుచేత?

సుబ్బారావు వేరు, అప్పారావు వేరూ కాబట్టి.

అంటే ఆ ఇద్దరి మధ్య భేదం -అదే- తేదా ఉంది కాబట్టి.

వాళ్ళ ముఖాలు వేరువేరుగా కనుపిస్తున్నాయి. వాళ్ళ ఒడ్డూ పొడుగూ వేరు వేరు. వాళ్ళ గొంతులు వేరు వేరుగా వినిపిస్తాయి. వాళ్ళ నడక తీరు వేరు వేరు. వాళ్ళ హావభావాలు వేరు వేరు.  ఇలా సవాలక్ష తేడాలు తెలుస్తూ ఉంటాయి.

అందుచేత సుబ్బారావు ఒక వ్యక్తి ఐతే అప్పారావు మరొక వ్యక్తి.

ఒకవేళ తప్పీ జారీ తెలుగుసినిమాల్లో కవలపిల్లల్లాగా ఆ సుబ్బారావూ అప్పారావూ అచ్చుగుద్ధినట్లు ఒక్కలాగే ఉంటే అన్న ప్రశ్న వేయవచ్చు మీరు.

అప్పుడైనా సరే ఏదో ఒక తేడా ఉండి తీరాలి మరి. పుట్టుమచ్చలో మరొకటో. గొంతు ఒకేలా వినిపించినా వాళ్ళ మాటతీరో మరొకటో వాళ్ళని విడివిడిగా పట్టిచ్చేలా ఉండి తీరాలి. అది సృష్టి ధర్మం. అది ప్రకృతి నియమం.

ఒక్కోసారి ఈ తేడా కనుక్కోవటం అనేది బ్రహ్మప్రళయం ఐపోతుంది. అదే పాయింటు మరి కుప్పలుతిప్పలుగా ఉన్న కవలపిల్లల కథల సినిమాలకు.

ఒక్కోసారి మనుషులే తికమక పడటం కాదు దేవతలు కూడా తికమక పడిపోతారట. అలా అని కొన్ని కథలున్నాయి లోకంలో.

నాకు తెలిసింది ఒకటి చెబుతాను.

నా చిన్నతనంలో మేము తూర్పుగోదావరి జిల్లాలోని గెద్దనాపల్లిలో ఉన్నాం కొన్నేళ్ళు.  అక్కడి కరణంగారు సోమప్ప గారని ఒక పెద్దమనిషి. చాలా సరదా మనిషి. వాళ్ళింట్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఆరోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి మా అమ్మగారు అనంతర కాలంలో నాకు చెప్పారు. అది మీకు చెబుతున్నానన్న మాట.

కరణం గారు కదా, ఆయన దగ్గరకు నిత్యం ఎవరెవరో రైతులు వస్తూ ఉండే వారు.  వరండా అంతా హడావుడిగా ఉండేది ఆ వచ్చేపోయే వాళ్ళతో.

ఒక రోజున మా నాన్నగారూ మా అమ్మగారూ వరండాలోనే ఉన్న సమయంలో ఒక రైతు కరణం గారి కోసం వచ్చాడు.  ఆ రైతును గురించి కరణంగారు ఒక ఆసక్తి కరమైన కథనం చెప్పారు మా అమ్మానాన్నలతో. అతడితో మా నాన్నగారు కూడా మాట్లాడారట ఆ నాడు.

కొన్నేళ్ళ క్రిందట గ్ర్తామంలో ఇంచుమించు ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అందులో విశేషం లేదు కాని, ఆ ఇద్దరూ ఒకేపోలిగ్గా ఉండే వారవ్వటం మాత్రం ఇక్కడి విశేషం.

ఆ యిద్దరిలో ఒకాయన వ్యవసాయదారు డైతే మరొకతను స్వర్ణకారుడు.

వ్యవసాయదారుడి శవదహనం పూర్తయింది కాని ఇంకా స్వర్ణకారుడి శవానికి అంత్యక్రియలు జరగలేదు.

అంతలో ఆ స్వర్ణకారుడు చచ్చినవాడు కాస్తా కళ్ళు తెరిచాడు!

అతడి కుటుంబమూ బంధువులూ అందరూ మహదానంద పడ్డారు.

కాని ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.

చచ్చి బ్రతికిన వాడు తాను వ్యవసాయదారుణ్ణనీ స్వర్ణకారుణ్ణి కాననీ, మీరందరూ నా బంధువులు కారనీ తిక్కతిక్కగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

తనను యమభటులు యముడి దగ్గరకు తీసుకొని పోయారట. అక్కడి వాళ్ళు భటుల్తో వీణ్ణెందుకు తెచ్చారు. వీడు కాదు అని భటుల్ని గదమాయిస్తే వాళ్ళు పొరపాటుకు నాలిక్కరుచుకొని అప్పుడు హడావుడిగా పోయి కంసాలి అతణ్ణి తీసుకొని వచ్చారట. తనని వెనక్కు తీసుకొని వచ్చారు కాని అప్పటికే తనదేహం తగలబడి పోయింది కాబట్టి చేసేది లేక ఈ దేహంలో ప్రవేశపెట్టి పోయారట భటులు.

ఈ తమాషా కథనం ఎవరూ నమ్మలేదు మొదట,

కాని అతను కాస్తా ఆ వ్యవసాయదారుడికి సంబంధించిన అన్ని విషయాలూ ఖచ్చితంగా చెప్పగా చివరకు నమ్మక తప్పలేదట.

ఇప్పుడు వచ్చింది అలా చచ్చి వేరొకరి దేహంతో బ్రతికి వచ్చిన రైతు అన్నమాట.

మా నాన్నగారు అడిగితే అతను చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడని మా అమ్మగారు నాతో అన్నారు. మట్టి మట్టిలో కలుస్తుంది గాలి గాలిలో కలిసిపోతుంది అంటారు కాని అలా ఎందుకు జరుగుతుందీ అని కూడా మా అమ్మగారు నాతో అన్నారు.

సరే శాఖాచంక్రమణం వదలి విషయంలోనికి వద్దాం. ప్రకృతిలో ఒక దానినుండి మరొకదానిని విడిగా తెలుసుకుందుకే నామరూపాలు. నామానికి రూపాన్ని స్ఫురణకు తేవటం ప్రయోజనం. రూపానికి ప్రకృతిని పరిపుష్టం చేయటం ప్రయోజనం.

ప్రకృతిలో ఉన్న యేదైనా తదితరంతో ఏదో ఒక విధమైన బేదాన్ని కలిగి ఉండటం ప్రకృతినియమం.  ఈ భేదం అనేది ఒక్కొక్క సారి తెలుసుకోవటానికి వీలు పడనంత గహనంగా ఉన్నా భేదం ఎక్కడో అక్కడ ఉండి తీరాలి.

అలాగే ఒకేనామం కలవి అనేకం ఉండవచ్చును. మీకు నలుగురు సుబ్బారావులు తెలిసి ఉండవచ్చును. ఏదో ఒక బేధం సూచిస్తే కాని ఏసుబ్బారావో అన్నది స్పష్టం కాదు కదా.

అందుచేత నామరూపాత్మకమై ఉండటమే తన యొక్క తత్త్వం ఐన ప్రకృతిలో ఈ భేదం కలిగి ఉండటం అనేది ముఖ్యలక్షణం అని మనం గుర్తుపెట్టుకోవాలి.

ఈ భేదం అనేది రకరకాలుగా ఉంటుంది.

ఆవులు వేరు మేకలు వేరు. ఆవులు వేరు గేదెలు వేరు. ఈ రకంగా ఒకదానితో ఒకటి వేరుగా ఉండటాన్ని విజాతి భేదం అంటారు.

మీ దగ్గర రెండు ఆవులున్నాయని అనుకుందాం. రెండూ ఆవులే ఐనా అవి మీకు విడివిడిగా తెలుస్తున్నాయి కదా. వాటి శరీరవర్ణంలో కొంచెం తేడాను బట్టో కొమ్ముల తీరును బట్టో తోకల తీరును బట్టో అలాంటిది మరొక శరీరలక్షణాన్ని బట్టో వాటి నడకనో అరుపునో బట్టో, ఈ రకమైన భేదాన్ని స్వజాతి భేదం.

ఒక ఆవు ఉందంటే అదొక ముద్దగా బంతిలాగా ఎటుచూసినా ఒకలాగా ఉందా? లేదు కదా? దానికి కొమ్ములున్నాయి, చెవులున్నాయి, తలా తోకా అంటూ ఉన్నాయి. ఇలా అది తనలో తాను ఒక్కోచోట ఒకలా ఉంది కదా? అటువంటి భేదాన్ని స్వగత భేదం అంటారు.

ఇలా స్వజాతి విజాతి స్వగతం అనే రకరకాల భేదాల ద్వారా తెలియబడటానికి కారణం మొట్టమొదటగా ఈ లోక వస్తువులు అన్నింటికీ ఒక స్థూలత్వం అనేది ఉండటం. ఈస్థూలత్వం అంటే మరేం కాదు స్వరూపాన్ని కలిగి ఉండటం.

అలాగే స్థూలత్వం కలిగి ఉండటం అంటే వాటి స్వరూపం కొంత భౌతికస్థలాన్ని ఆక్రమించుకొని ఉండటం.

సామాన్య విద్యార్థికి కూడా ఒక విషయం తెలిసే ఉంటుంది.  ప్రపంచంలో ప్రతిది భౌతికస్థలంలో కొంత పొడవు వెడల్పు ఎత్తు అనే పరిమాణాలు కలిగి ఉంటుంది అని.

అది ఒక వస్తువైనా జీవియైనా ఈ త్రిపరిమాణాలనూ కలిగి ఉండాలి ప్రకృతిలో. అంతే కదా?

ఇప్పుడు ఒక సంగతి ఆలోచించండి. ఒక కాగితం మీద ఆవుబొమ్మ వేసాం అనుకోండి. అది మీరు కావాలంటే ఆవు అంత ఆకారంలో గీసినా అది ఆవు అంత ఎత్తుగా ఉండదు కదా.

దానికి కారణం సులభంగానే తెలుస్తున్నది కదా. కాగితం బొమ్మలో రెండు పరిమాణాలే ఉన్నాయి. పొడుగూ వెడల్పూ అని.

సాంకేతికంగా మూడు పరిమాణాలూ ఉన్నది విగ్రహం ఐతే రెండు పరిమాణాలే ఉన్నది యంత్రం అన్నమాట.

మరి, ఒకే పరిమాణం ఉన్నది ఉందా అంటే తప్పకుండా ఉంది. దాన్ని రేఖ అంటారు. అది సరళరేఖ ఐనా వక్రరేఖ ఐనా దానికి ఎంతో కొంత పొడుగు అనే ఒకే ఒక పరిమాణం ఉంది కాని అంతకు మించి వ్యవహారం లేదక్కడ.

చివరాఖరుకు ఒక ప్రశ్న. ఈ ఒక్క పరిమాణాన్ని కూడా తొలగిస్తే? ఈ విషయం గురించి ఆలోచిద్దాం.

విగ్రహం ప్రకృతిలో దృశ్యమానంగా ఉంటుంది. యంత్రం కూడా దృశ్యమానంగానే ఉంటుంది. లేకపోతే బొమ్మలపుస్తకాలు లేవు కదా! విడిగా కాగితం పైనో గోడమీదో రేఖలు గీస్తే అవీ దృశ్యమానమే.

మూడు పరిమాణాలూ తొలగిస్తే, ఆ త్రిపరిమాణ రహితమైన దానికి బిందువు అని పేరు. దానిని మనం ఏరూపంలోనూ గ్రహించలేం. దానిని దృశ్యమానం చేయటం కుదరదు కాబట్టి.

ప్రకృతిలో ఉన్నది యేదైనా సరే దానికి రూపం అనేది ఉండి తీరాలి అన్నది గుర్తుకు తెచ్చుకోండి. ఒకటో రెండో మూడో పరిమాణాల్లో అది మన ఇంద్రియాలకు గోచరం అవుతూ ఉండటం వలన దాని ఉనికిని గుర్తించ గలం.

కాబట్టి బిందువు అనేది ప్రకృతికి ఆవలి వస్తువు!

17, జులై 2019, బుధవారం

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా


అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా। 12

లోకంలో ఉన్న వస్తువులను ఇతర వస్తువులతో పోల్చి చెప్పటం అన్నది కొత్త విషయం కాదు. అందరం ఈ పని చేస్తూనే ఉంటాం. ఐతే పోల్చటం అనే అవసరం ఎప్పుడు వస్తున్నది అన్నది కొంచెం ఆలోచించాలి ఇక్కడ.

చెప్పేవాడు వినేవాడు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో పోలిక అవసరం వస్తున్నది కదా. అదికూడా ఫలాని వస్తువు ఎలాగు ఉన్నది అన్న విషయాన్ని చెప్పేవాడు విశదం చేయవలసిన సందర్భంలో. 

కాకి ఇలా ఉన్నది అని ఎవరూ కాకిని దేనితోనూ పోల్చి చెప్పనవసరం లేదు. వినేవాడు కాకిని ఎలాగూ చూసే ఉంటాడు కాబట్టి. అలాగే ఉంగరం అంటే ఇలా ఉంటుంది అని చెప్పనవసరం లేదు.  చెప్పేవాడు ఒక కొత్త వస్తువును గురించి చెప్పాలి అనుకోండి. అది అంతకు పూర్వం వినేవాడికి తెలిసి ఉండదని నమ్మకం అనుకోండి. అప్పుడు ఆ వస్తువును గురించి ఎలా చెప్పాలి? ఆ వస్తువు యొక్క ఆకృతిని దేనితో నైనా పోల్చి చెప్పాలి ఏదో విధంగా. దాని యందు గమనించిన లక్షణాలను కూడా వేటితో నైనా పోల్చి చెప్పాలి. అప్పుడు కదా వినేవాడికి కొంతగా అవగాహన వస్తుంది.

మరొక పక్షంలో మీరు ఒక కొత్త రకం కాకిని చూచారు. అది కాకి కావచ్చు కాని దానిలో  నేమి విశేషం ఉన్నదో ఎలాగో అలా పోలికల సహాయంతో కదా చెప్పగలిగేది. మాటవరసకు అది కొంగలాగా తెల్లగా ఉంది అన్నారనుకోండి. కొంగ తెలుపు ఎటువంటిదో తెలుసును కాబట్టి ఆ కొత్త కాకి మీకంటికి ఎలా కనిపించిందో ఆవలి వాడికి తెలుస్తుంది. అలాగే ఒక గద్ద అంత ఉంది అన్నారనుకోండి. అది ఎంత పరిమాణంలో ఉందో తెలుస్తుంది అంచనాకు.  ఇటువంటివి కదా పోలికల అవసరాలు మనకు ప్రపంచంలో.

ఈ లలితాసహస్రనామ స్తోత్రంలో అమ్మ స్వరూపాన్ని వర్ణిస్తూ కొన్ని కొన్ని పోలికలు చెప్పారు.  పద్మరాగ శిలాదర్శి పరిభావి కపోల భూః వంటివి. ఆ నామం ప్రకారం అమ్మ చెక్కిళ్ళ వర్ణసౌందర్యం పద్మరాగ మణుల ఎఱుపును ధిక్కరిస్తోంది అని తెలుసుకుంటున్నాం.  నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా అన్న నామం ప్రకారం అమ్మ ముక్కు  అప్పుడే వికసించిన సంపంగిపూవులా ఉంది అనగానే ఆ నాసిక సోయగం యొక్క అతిశయం తెలుస్తున్నది మనకు.

ఇలా రూపవర్ణనం చేస్తూ అమ్మ యొక్క గడ్డం దగ్గరకు వచ్చేసరికి పెద్ద గడ్డు సమస్య వచ్చింది!

అమ్మ గడ్డ్డం అనాకలితం. అంటే అది ఇలాగు ఉందని చెప్పటానికి పోలికగా ఏదీ సృష్టిలో దొరకటం లేదు. ఎంత కష్టం ఎంత కష్టం!

వేదవ్యాసులవారు ఘటికులు. ఒక అందమైన పోలిక చెప్పటానికి యత్నించారు.  బ్రహ్మాండపురాణంలో ఆయన 'ముఖదర్పణ వృంతాభ చుబుకా పాటలాధరా' అన్నారు.

ముఖం అనే గుండ్రటి చేతి అద్దం ఉందట, దానికి పిడిలాగా ఉందట గడ్డం!

ఇది కొంచెం అందంగా ఉన్న ఉపమానమే కాని అంత గొప్పగా లేదు. మరి గడ్డం ముఖంలో భాగమే కదా వంటి శంకలు వస్తున్నాయి కాబట్టి. అదీ కాక ముఖం అద్దం ఐతే దానిని అద్దం వలె భావించినది ఎవరూ అన్న ప్రశ్న ఉన్నది!

శంకరాచార్యులవారు తమ సౌందర్యలహరిన్లి 67వ శ్లోకంలో ఇలా అంటున్నారు.

కరాగ్రేణ స్పష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా 
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృన్తం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చిబుకం ఔపమ్యరహితం

ఓ గిరిసుతా పార్వతీ,  నీ చిన్నతనంలో,  ఎంతో వాత్సల్యంతో మీ తండ్రి హిమవంతుడు తన చేతి వ్రేళ్ళ కొసలచేత నీ గడ్డాన్నిపుణుకుతూ ఆనందించాడు. అమ్మా నీ పతిదేవుడైన శివుడు నీ అధరామృతం పానం చేయాలన్న ఆతురతతో మాటిమాటికీ నీ గడ్డాన్ని పైకెత్తుతూ త్వరపడుతుంటాడు.  అలా నీముఖం అనే అద్దాన్ని పైకెత్తటానికి మంచి పిడిలా ఉన్నది కదా నీ  అందమైన సాటిలేని గడ్డం. అసలు సృష్టిలో మరొక దానితో పోలికే లేని నీ గడ్డాన్ని ఏమని వర్ణించగలను అని అంటున్నారు శంకరులు.

పుత్రాదౌ వాత్సల్యం, పత్నాదౌ ప్రేమ, శిష్యాదా వనుగ్రహః అగ్రజాదౌ భక్తి అని వాత్సల్య శబ్దానికి వ్యాఖ్యానం. పుత్రుడైనా పుత్రిక ఐనా సరే తనకు ప్రతిరూపమే అన్నది నిర్వివాదంగా సంప్రదాయికమైన భావన. హిమవంతుడు తల్లి ముఖమండలం అనే అద్దంలో తనను తాను చూచుకొంటున్నాడని భావించవచ్చును.

కైలాస శంకరులు పార్వతీముఖాన్ని దర్పణంగా భావించటం దేనికయ్యా అంటే ఆమె ముఖం అనే దర్పణంలో తనను తాను చూచుకొనేందుకని భావం.  మరల ఆవిడ ముఖమండలంలోనే చెక్కుటద్దాలు లేవా పద్మరగాల స్నిగ్ధ సోయగాలను ధిక్కరిస్తూ? ఆ అద్దాల సంపుటిలో ఆయన తనను తాను చూచుకొందుకు గాను పెకెత్తటానికి శ్రీదేవి గడ్డం ఒక చక్కని పిడిలా ఉన్నదట!

ఆ గడ్డం లోకంలో ఫలాని వస్తువులాగా ఉన్నది అని చెప్పటం సాధ్యపడదు. దానికి అదే సాటి అమ్మ చుబుకం

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా


నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ।
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। 11

మందస్మితం అంటే చిరునవ్వు. ఈ నామంలో వశిన్యాదులు అమ్మ చిరునవ్వు గురించి చెబుతున్నారు.  నిజానికి స్మితం అంటేనే చిరునవ్వు. అటువంటప్పుడు మందస్మితం అనటం దేనికీ? ఈ మందం అనే ఉపసర్గను స్మితశబ్దానికి ముందు చేర్చటం ఎందుకూ అన్న ప్రశ్న వస్తుంది కదా.

మంద అన్నసంస్కృతశబ్దానికి అర్థం మొల్లనిది అని అర్థం. సంసృత ఛందస్సులలో మందాక్రాంతం అని ఒక వృత్తం ఉంది. దాని అర్థం మెల్లగా ఆక్రమించబడినది అని అర్థం. అది వర్షాకాలంలోని దట్టమైన మేఘాలు వచ్చి మెల్లగా  ఆక్రమించిన ఆకాశాన్ని ఉద్దేసించి ఊహించటం సొగసుగా ఉంటుంది కదూ.  అందుకే కాళిదాస మహాకవి ఆ వృత్తాలలో మేఘసందేశం అన్న అద్భుతమైన లఘుకావ్యం రచించాడు.

అమ్మాయిని మందగమన అనటం కవుల వాడుకలో తరచుగా వినిపిస్తుంది. అంటే అమ్మాయిలు మెల్లగా నడుస్తారనీ అది వారికి అందగిస్తుందనీ ఉద్దేశం. అలాంటి అందమైన మెల్లని నడక కల అమ్మాయి అని చెప్పటం అమ్మాయిల పరంగా ఒక సుగుణంగా విశేషంగా చెప్తారు కవులు.

అలాగే స్మితం అంటే చిరునవ్వే కావచ్చును. ఆ చిరునవ్వు కూడా ముఖమండలంపైన మెల్లగా ఆవిష్కరించబడటం అన్నది ఇక్కడ నామం చెప్పే విశేషం.

ఎప్పుడైనా కవిత్వంలో చిరునవ్వు వెన్నెలలు వంటి ప్రయోగాలు విన్నారా? వినే ఉంటారు. అందమైన చిరునవ్వులకు చిరునామా అమ్మాయిల ముఖాలే కాబట్టి వెన్నెలలవలె విరబూసే చిరునవ్వులు సహజంగానే కవిత్వాల్లో స్త్రీపరమైన వర్ణనల్లోనే వస్తాయి.

వెన్నెలకు వాతావరణాన్ని ఆహ్లాదపరచే శక్తి ఉంది.
చిరునవ్వుకు వాతావరణాన్ని ఆహ్లాదపరచే శక్తి ఉంది.
అందుకనే కవులు చిరునవ్వులను వెన్నెలతో పోలుస్తూ ఉంటారు.

ఈ నామంలో మందస్మితప్రభ అని చెప్పారు చూడండి. అది అమ్మ చిరునవ్వుల చల్లని వెలుగులు అని అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగానే తెలుస్తున్నది కదా.

సాధారణమైన స్త్రీల చిరునవ్వులకే వెన్నెలవలె అమితమైనా అహ్లాదన శక్తి ఉంటే సకల జగత్తులోనూ అత్యుత్తమైన స్త్రీత్వం తన సొత్తు ఐన అమ్మ చిరునవ్వు ఎంత గొప్ప ప్రభగా ఉంటుందో మీరే ఊహించండి.

పైగా ఈ నామం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా అన్న దానిలో మందస్మితప్రభాపూరం అంటున్నారు. ప్రభాపూరం అంటే కాంతి యొక్క ప్రవాహం! ఒక మహా నదీ ప్రవాహంలా కొల్లగా ఉన్నది అన్నమాట అమ్మ యొక్క మెల్లని చిరునవ్వుల చల్లని కాంతి ప్రసరణం.

స్త్రీల చిరునవ్వులకు అకర్షితులై సంతోషంతో తబ్బిబ్బులయ్యేది ఆయా ఉత్తమస్త్రీల పతిదేవుళ్ళు.

ఇక్కడ కూడా అంతే.

అమ్మ కామేశ్వరి. ఆవిడ కు పతిదేవుడైన అయ్యవారు కామేశ్వరుడు.

ఆ మహానుభావుడు కామేశ్వరుడి మానసం ఆ ప్రభాపూరంలో మజ్జనం ఆచరిస్తోందట.

మజ్జనం అంటే స్నానం. మరొక అర్థం మునక అని కూడా ఉంది.

అయ్యవారు అమ్మ చిరునవ్వులో ఐనా సరే మునిగిపోయారు అని అనటం కుదరదు. ఎందుకంటే మునిగిపోయిన వాడికి చేష్టలు ఉడిగిపోతాయి. అలా చెప్పటం అపచారం అవుతుంది. పైగా ఇక్కడ మజ్జత్ అన్నప్పుడు అది వర్తమాన కాల ప్రయోగం కాబట్టి మునిగిపోవటం అన్న భూతకాలసూచన అసంగతం కూడా.

అయ్యవారు అమ్మ చల్లని చిరునవ్వుల కాంతి ప్రవాహంలో ఆనందంగా మునిగీతలు కొడుతూ ఉన్నారని చెప్పటం సమంజసంగా ఉంటుంది.

ఈ నామంలో అయ్యవారిని కామేశుడు లేదా కామేశ్వరుడు అని వాచ్యంగా చెప్పారు. ఇక్కడ కామేశ అన్న పదంలో ఉన్న కాముడు మన్మథుడు అనుకోకండి. అలాగే త్రిమూర్తుల్లో ఒకడైన రుద్రుడు అని కూడా అనుకోకండి. ఈ కామేశుడు కామకళారూపి యైన పరశివుడు. ఈ విషయంగా కామకళా విలాసంలో

బిందు రహంకారాత్మా
రవి రేత ర్మిథున  సమరసాకారః
కామః కమనీయతయా
కలా చ దహనేందు విగ్రహౌ బిందూ

ప్రకాశవిమర్శా మిశ్రస్వరూపమైన మహాబిందువు ఉంది. అది అహమనే వర్ణద్వయం కలిగి ఉంది, ఇది రక్తశుక్ల బిందువుల మేళనము. అంటే చంద్రాగ్నుల సమిష్టి రూపం. ఈ బిందువులోని ప్రకాశవిమర్శాంశలే కామేశ్వర మేమేశ్వరీ దివ్యదంపతులు. ఈ ఉభయాంశల మిశ్రబిందువే సూర్యస్వరూపం. ఇదే సర్వకారణ బిందువు.

ఇక్కడ కామేశ శబ్ధం ఈ విధంగా పరశివ వాచకం. కామకళాస్వరూపం అని గ్రహించాలి.

అమ్మ ముఖమండలములోని చిరునవ్వుల ప్రభల చల్లని కాంతి ప్రవాహం ఆ కామేశ్వరుని మనస్సును పూర్తిగా ఆకర్షించి సంతోషంలో మునకలు వేయిస్తున్నదని ఈ నామం చెబుతోంది.

అమ్మ చిరునవ్వు రాగరహితం. కారణాతీతం.  కారణరహితం. అది నాదానంద, ప్రణవానంద, బ్రహ్మానందాల స్వరూపం. అమ్మ ముఖం ఆనందస్వరూపం.

19, మే 2019, ఆదివారం

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ


నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। 11

మాధుర్యం అనగా తీయందనం.

ఈ నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ అన్న నామంలో వశిన్యాదులు అమ్మ మాటల మాధుర్యాన్ని వర్ణిస్తున్నారు.

సల్లాపం అంటే మట్లాడటం. అందుచేత సల్లాప మాధుర్యం అంటే మాట్లాడినప్పుడు ఆ మాటలోని మధురిమ అని అర్థం. ఇంక నిజసల్లాపమాధుర్యం అని నిజ అన్న శబ్దాన్ని ముందు చేర్చి చెప్పినప్పుడు తనయొక్క మాటలోని మాధుర్యం అన్నది అర్థం. ఇక్కడ చెబుతున్నది అమ్మను గురించి కదా, కాబట్టి నిజసల్లాపమాధుర్యం  అంటే అమ్మ మాటలోని మాధుర్యం అన్నమాట.

ఆ  మాధుర్యం అనగా అమ్మ మాటల్లోని తీయందనం ఎలా ఉందంటే కఛ్ఛపి అనేది వినిర్భితం ఐనదట.

నిర్భిన్నం కావటం అంటే దెబ్బతిన్నది కావటం. కఛ్ఛపి వినిర్భితమైనది అంటే కఛ్ఛపికే దెబ్బతగిలిందీ అని అర్థం.

కఛ్ఛపి అంటే సరస్వతీ అమ్మవారి వీణ.

పౌరాణిక వాంగ్మయంలోనూ వైదికవాంగ్మయంలోనూ వస్తువులకూ పేర్లు ఉండటం కొత్త విషయం కాదు. మాటవరసకు విష్ణుమూర్తి గారికి ఐదు ఆయుధాలున్నాయి. అవి చక్రం, శంఖం, గద, ఖడ్గం,విల్లు. వాటికి విడివిడిగా పేర్లున్నాయి. విష్ణువు చక్రం పేరు సుదర్శనం. ఈ పేరు అందరికీ చాలా పరిచయం ఉన్నదే. శంఖం పేరు పాంచజన్యం, , గద పేరు కౌమోదకి. అయన ఖడ్గం పేరు నందకం - అన్నమయ్య గారు ఈ నందకం యొక్క అంశావతారం అని ప్రతీతి. విష్ణువు వింటికి పేరు శార్ఙ్గము.

విష్ణువు వింటికి పేరు  శార్ఙ్గము ఐతే శివుడి విల్లు పినాకం అందుకే ఆయనకు పినాకి అని వ్యవహారం.

అలాగే వేరే వేరే దేవతల చేతుల్లో భాసించే వీణలకూ వేరు వేరు పేర్లున్నాయి.

విశ్వావసో స్సా బృహతీ తుంబురోస్తు కళావతీ
సా నారదస్య మహతీ  సరస్వత్యాస్తు కఛ్ఛపీ

అని విశ్వావసువు వీణకు బృహతి అని పేరు. ఈ విశ్వావసుడు ఒక గంధర్వరాజు, యాజ్ఞవల్క్యమహర్షి శిష్యుడు. తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు. నారదుడి వీణ మహతి. సరస్వతీ దేవి వీణ పేరు కఛ్ఛపి.

కొందరు కఛ్ఛపి అంటే కఛ్ఛపుడు అనే అయన భార్య అని వ్యాఖ్యానించారు కాని అది పొరపాటు.

సరస్వతి చేతిలోని వీణ కఛ్ఛపి అన్నాం కదా. దాని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అది ఇతర దేవతల వీణల లాగా కాక స్పష్టంగా అక్షరాలను స్ఫురింపచేస్తూ ధ్వనిస్తుంది.

లోకంలో మనుష్యాదులు అంతకంటే స్పష్టంగానే అక్షరాలను పలుక గలరు కదా అనవచ్చును.

కాని సరస్వతి వీణ వలె స్పష్టతతో పాటు మాధుర్యం కూడా ఆ స్థాయిలో ఉండదుగా. అందుకని సరస్వతీ అమ్మ వీణ ప్రత్యేకం అన్నమాట.

మరొకవిధంగ కూడా కఛ్ఛపి అన్న వీణావిశేషానికి వివరణ ఉంది. పైన చెప్పిన నాలుగు వీణలూ అంటే బృహతి, కళావతి, మహతి, కఛ్ఛపి అనేవి నలుగురి చేతిలో కనిపించే నాలుగు రకాలైన వీణలు అని.

ఈ నాలుగు రకాల వీణలలోనూ తంత్రులు భిన్నంగా ఉంటాయి. కళావతిలో 4, కఛ్ఛపి, మహతీ వీణల్లో 7 తంత్రులుంటే బ్రృహతిలో 15 తంత్రులుంటాయి.

కళావతీవీణ తుంబురుడిది. అందుకే దానికి తుంబురా లేదా తంబురా అని పేరు వచ్చింది. దీనికి వివిధ మైన కళలు అనగా శ్రుతులని పలికించటం ప్రత్త్యేకత.

బృహతి, మహతి ఎక్కువగా ఉత్తరదేశ వాద్యాలైతే కఛ్ఛపి దక్షిణదేశానికి చెందినది.

కఛ్ఛపికి వెండి బంగారు దంతాలతోనూ అలంకరణలు ఉంటే మహతికి మాత్రం సొరకాయబుర్రలూ వెదురుబొంగులతో సాదాగా ఉంటుంది.

కఛ్ఛపిలో 24 మెట్లు ఉంటే మిగిలిన రకాల్లో 20 మెట్ట్లే ఉంటాయి.

ఎక్కువ మెట్లుండటం చేత కఛ్ఛపి ఎక్కువ స్వరస్థానాల్ని పలికించగలదు. అదీ దాని ప్రత్యేకత.

ఐతే శ్రీలలితాపరాభట్టారికా దేవీ అమ్మ పలుకుల స్పష్టతా తీయందనమూ సాటిలేనివి. అందుచేత అమ్మ సంభాషణా మాధుర్యం సర్వాతిశాయి అనటంలో సందేహం లేదు.

ఈ విషయంలో సౌందర్యలహరీ స్తోత్ర్తంలో శంకరులు ఇలా అంటున్నారు.

విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్

ఈ సొగసైన శ్లోకం ప్రకారం సరస్వతీ దేవిని గురించి ప్రస్తావిస్తూ అమ్మతో శంకరులు ఏమంటున్నారో చూడండి.

అమ్మా సరస్వతీ దేవి నీ ముందుకు వచ్చి రకరకాలుగా శివుడి విజయగాథలను గురించి వీణాగానం చేస్తోంది. హాలాహలం స్వీకరించటం గురించి పాడుతోంది. త్ర్రిపురాసురుల్ని నిర్జించటం గురించి పాడుతోంది. దక్షయాగం ధ్వంసం చేయటం గురించి పాడుతోంది. గజాసురవృత్తాంతం పాడుతోంది. ఇలా అనేక కథలను నీ ఆనందం కోసం నీముందు గానం చేస్తోంది.

నువ్వు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నావు. తలవూపుతూ ఆ సంతోషం వెలుబుచ్చుతున్నావు. అప్పుడప్పుడు బాగుంది బాగుంది అని మెచ్చుకుంటూ ఆమె చాతుర్యాన్ని అభినందిస్తూ మాట్లాడుతున్నావు.

నీ మాటల మాధుర్యాన్ని ఆలకించి ఆశ్చర్యంతో సరస్వతి తబ్బిబ్బు అవుతోంది.

అమ్మ మాటల ముందు నా వీణాగానం మదురిమ ఏపాటిది అని సిగ్గుపడుతోంది.

అలా బిడియపడిన సరస్వతీ దేవి తన వీణను వెంటనే గవిసెనతో కప్పుతోంది, వాదనం చాలించి!

ఎంత సరస్వతీ దేవి చేతి వీణ ఐనా నీ మాటల మాధుర్యం ముందు అదెంత.

ఇలా శంకరులు తమ సౌందర్యలహరిలో అమ్మ పలుకులు సరస్వతీ వీణను చిన్నబుచ్చుతున్నాయని చెప్పారు.

ఇక్కడ శంకరులు అమ్మ సల్లాపం అతి మధురం అన్న విషయంలో సరస్వతితో అమ్మ ఆడిన పలుకులను ప్రస్తావించారు.  మరొక రకంగా భావిస్తే అమ్మ సల్లాపం ఎవరితో నిత్యత్వం కలిగి ఉందో మనం సులభంగా ఊహించగలం కదా. అది కామేశ్వరునితో అని వేరే చెప్పాలా.

సరస్వతీ దేవి వీణ ఎంతగా మాధుర్యానికి పెట్టింది పేరైనా అది అమ్మ అయ్యవారితో ప్రసంగించటంలోని మాధుర్యానికి సాటి రాదు. అమ్మ వాక్కు నాదబ్రహ్మస్వరూపం కదా,

బహిర్మాతృకాన్యాసంలో అమ్మ ముఖవృత్తానికి విసర్గతో న్యాసం.

14, మే 2019, మంగళవారం

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 10

ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో అమ్మ సేవించిన కర్పూరతాంబూలం గురించి వశిన్యాదులు వివరిస్తున్నారు.

వీటిక అంటే తాంబూలం. రోజుల పుణ్యమా అని ఇప్పుడు పాన్ అంటే కాని జనానికి అర్థం కాదేమో! అందరికీ తెలుసుగా ఈ పాన్ అనే దానిలో లక్షరాకాలుంటాయి.

ఒకప్పుడు మనం అందరం తాంబూలం అని పిలచుకొనే దానిలో ఎన్ని రకాలున్నాయో తెలియదు. కాని బాగా పేరుకెక్కింది మాత్రం కర్పూరతాంబూలం. ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో అమ్మ వేసుకున్నది అని చెప్పినది కూడా కర్పూరవీటిక అనగా కర్పూర తాంబూలమే!

ఇక్కడ కర్పూరం అంటే తినటానికి వాడే పచ్చకర్పూరం. అంతే కాని హారతిపళ్ళెంలో వెలిగించే రకం కర్పూరం కాదు.

మీఠా పాన్ అనగానే ఏదో ఇన్ని తములపాకుల మీద ఇంత పంచదార చల్లి చుట్టేస్తాడా ఏమిటీ? కాదు కదా. అలాగే కర్పూరతాంబూలం అంటే దానిని చుట్టటానికి చాలా గ్రంథం ఉంది.

ఏలా లవంగ కర్పూరీ కస్తూరీ కేసరాధిభిః
జాజీఫలదళైః పూగైః లాంగల్యూషణ నాగరైః
చూర్ణైః ఖదిర సారైశ్చ యుక్తా కర్పూరవీటికా.

అంటూ కర్పూరతాంబూలం చుట్టటానికి కావలసిన సరంజామా ఏకరువు పెట్టారు. ఏమేం కావాలంటే ఏలకులు (ఏలా), లవంగాలు, కర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు (కేసరి), జాజికాయ (జాజీఫలదళం), వక్కలు (పూగైః), కాచు(ఖదిరం), మిరియాలు (ఊషణము), శొంఠి (నాగరం). ఇవన్నీ చక్కగా చూర్ణంగా చేసి తాంబూలంసేవిస్తే అది కర్పూర తాంబూలం అవుతుంది.

కర్పూరపు చెట్టు వేళ్ళనూ చెక్కనూ నీళ్ళలో మరగించి ఆ ఆవిరినుండి సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. ఈనాడు మనకి పూజలకు బిళ్ళల రూపంలో దొరికేది అంతా రసాయన పదార్థమే కాని నిజం కర్పూరం కాదు.

ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో ఆమోదం అన్న పదానికి ఇక్కడ ప్రయోజనం ఆ కర్పూరతాంబూలం నుండి వెలువడుతున్న సుపరిమళానికి లభించిన ఆదరణను గురించి స్పష్టం చేయటం. ఆ పరీపళం ఎంతగా వ్యాపించిందో చెబుతున్నారు. అది  సమాకర్షద్దిగంతర మైనది అట. అంటే అన్ని దిక్కులనూ చక్కగా సమంగా ఆవిరించింది అని.

నిజమే కర్పూర పరీమళం అంత గొప్పగా ఉంటుంది. ఆ కర్పూరమిళిత పరీమళం మన ముక్కుకు సోకగానే చుట్టుపక్కల ఎవరో కర్పూరతాంబూలం వేసుకొని ఉన్నారూ అని తెలుస్తుంది అన్న మాట. దీనికి గొప్ప ఋజువుగా తెలుగు సాహిత్యంలో అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో ఒక పద్యం చెప్పారు.

ప్రవరుడు అనే అమాయక బ్రాహ్మడు ఎవడో సిధ్ధుడు కాలికి పాదలేపనం పూస్తే దాని ప్రభావంతో హిమాలయాలను చూడటానికి పోయాడు. అక్కడ ఆ లేపనం కాస్తా మంచులో కలిసిపోయి పాదాలు రిత్తబోయి ఇంటికి తిరిగి వెళ్ళే దారిలేక లబోదిబో మని మొత్తుకున్నాడు. కాస్త ఉపాయం చెప్పేవాళ్ళెవరన్నా చుట్టుపక్కల దొరుకుతారా అని ఆ మానవుడు వెదుకు తున్న సమయంలో గొప్ప సువాసన ఒకటి అతడి ముక్కుకు సోకిందట. అది ఎలాగు ఉందని?

కం. మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ
స్థగితేతర  పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మెగసెన్.

కస్తూరి దట్టించిన కర్పూర తాంబూల పరీమళం అది. అది ముక్కుకు తగిలి ఏమని తెలిపిందట. మగువపొలుపు. అంటే ఇక్కడ ఎవరో ఆడవాళ్ళున్నారూ వాళ్ళు కర్పూరతాంబూలం వేసుకొని ఉన్నారూ అని మనవాడికి ఆ తాంబూలపు సువాసనలు మోసుకొని వచ్చిన గాలి తెలియజేసిందట.

అలా కర్పూరతాంబూల పరీమళం నలుదిక్కులా వ్యాపిస్తుంది.

కర్పూర తాంబూలం ఆడామగా అందరూ సేవిస్తారు. ఈ పెద్దన గారే కవిత్వం వ్రాయటానికి కావలసిన సంబారాల చిట్టాను ఒక పద్యంలో చెప్పారు చూడండి.

నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే

ఆయన చెప్పిన చిట్టాలో కప్పురవిడెమూ ఉంది.

మరి కర్పూరతాంబూలం ఆడామగా అందరూ వేసుకొంటారు కదా మరి ప్రవరాఖ్యుడికి తాంబూలపు సువాసనను బట్టి చుట్టుపక్కలనే తాంబూలం వేసుకొన్న స్త్రీ ఉన్నదీ అని ఎలా తెలిసిందీ,  మగవాడూ ఉండి ఉండవచ్చును కదా అని అనుమానం వస్తుంది. పద్యం మరొకసారి చూడండి. ఆ తాంబూలపు సువాసనలో కర్పూరపు పరీమళమే కాదు మృగమద (కస్తూరి) పరీమళమూ కలిసి ఉందట. కస్తూరితో కలిసిన తాంబూలం వేసుకొనేది ఆడవాళ్ళు మాత్రమేను. ఎందుకంటే కస్తూరిని ఆడవారే వాడుతారు. దీనికీ తెలుగు సాహిత్యంలో సాక్ష్యం ఉంది చూడండి.

అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షా దానము సేయరా సుకవి రాడ్బృందారక శ్రేణికిన్
దక్షారామపురీ విహార వర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు దద్వాసనల్

ప్రసిధ్ధమైన ఈ పద్యం  శ్రీనాథ మహాకవి చాటువు.ఆయన రాజుగారిని కస్తూరి ఇప్పించవయ్యా అని ఠీవిగా అర్థిస్తున్నాడు. అదేం చేసుకుంటావయ్యా అంటే, దక్షారామంలో ఉన్న వేశ్యాయువతులకు పరిమళద్రవ్యంగా అలంకరించుకుందుకు ఇస్తాడట!

శాఖా చంక్రమణం అవుతున్నది కదా. విషయంలోని వద్దాం. ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా నామం అమ్మ సేవించిన కర్పూరతాంబూలం గురించి. దాని ప్రభావం ఎంతంటే వశిన్యాదులు, ఆ సువాసనలను దిక్కులను ఆవరిస్తున్నాయి అని చెబుతున్నారు.

లలితా త్రిశతిలో ఇలాంటి నామం ఒకటుంది.కర్పూరవీటీ సౌరభ్య కల్లోల కకుప్తటా అని. అక్కడ అది 14వ నామం. దీని అర్థం అమ్మ కర్పూరతాంబూల సుగంధంతో కల్లోలితమైన జగత్ప్రదేశం కలది అని.

అమ్మ సేవించిన తాంబూల పరీమళం దిక్కులన్నిటా వ్యాపించిందీ అని చెప్పటంలో ఒక విశేషం ఉంది.

దిగంతరా అని అమ్మను సంబోధించారు కదా. అంతరము అంటే కట్టుకోక అని అర్థం. దిగంతరా అంటే అమ్మకు దిక్కులు పరిధానంగా ఉన్నాయని. అంటే అమ్మ తాంబూలపు పరిమళానికి దిక్కులు ఆకర్షణ చెంది వచ్చి చుట్టూ చేరి ఒక ఆవరణ (పరిధానం, అంతరం)లా ఏర్పడ్డాయని చమత్కారం.

అలా ఎందుకు చుట్టు చేరారు దిగ్దేవతలు అని అనవచ్చును. అమ్మ తాంబూలం అత్యంత మహిమాన్విత మైనది. అమ్మ తాంబూలకబళం అనుగ్రహిస్తే సేవించి తరించాలన్న తాపత్రంయంలో దిగ్దేవతలు చుట్టుముట్టి ఉన్నారని అర్థం.

ఏమిటండీ ఆ మహిమా విశేషం అంటారా? అదీ చూదాం ఒక చిన్న కథలో.

అది క్రీ.శ. 4వ శతాబ్దం. కంచిలో విద్యాపతి గారనే ఒక ఖగోళ జ్యోతిర్విద్వాపారంగతుడొకాయన ఉండే వాడు. ఆయన కొడుకు మూగవాడు. ఆ పిల్లవాడు తన గతికి వగస్తూ అమ్మను వేడుకొంటూ కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధానంలో నిత్యం ఉండేవాడు.

ఒకరోజున పెద్దావిడ కర్పూరతాంబూలం నములుతూ అలయంలో తిరుగుతూ ఉంది. ఈ మూగపిల్లవాడూ ఆతని పక్కనే ధ్యానం చేసుకుంటున్న మరొక సాధకుడూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.

తన నోటిలోని తాంబూలం నుండి ఒక చిన్న పిడచ తీసి ఆ సాధకుడికి ఇవ్వబోయింది. ఆతను చీచీ అంటూ దూరంగా తొలగి పోయాడు.

అమె ఆ పిడచను ఆ మూగ పిల్లవాడి దోసెట్లో వేసింది. అతడు కళ్ళకద్దుకొని నోటిలో వేసుకొన్నాడు.

మరుక్షణం ఆ పిల్లవాడికి మాటవచ్చింది. వచ్చింది మాటా? అది మహాగంగా ప్రవాహం వంటి కవితాధార!  ఆ తాంబూలకరండం అనుగ్రహించిన పెద్దావిడ కంచి కామాక్షీ అమ్మవారు అని ఆ మూగపిల్లవాడు గ్రహించాడు జన్మాంతర సంస్కారప్రభావంతో. అంతే, ఆ మహామహిమాన్విత తాంబూలకరడం కళ్ళకద్దుకొని స్వీకరించాడు. ఆ మూగ పిల్లవాడు మహా కవి ఐపోయాడు తక్షణమే.

ఆశువుగా ఆ పిల్లవాడు అమ్మని స్తుతిస్తూ ఐదువందల శ్లోకాలు చెప్పాడు. ఆ స్తోత్రాన్ని మూకపంచశతి అంటారు. ఆ ఐదు వందలలో ఒక వంద ఆర్యాశతకంగా అమ్మవారి గొప్పదనాన్ని వివరించేదిగా. ఒక వంద స్తుతిశతకంగా అమ్మను స్తుతించేదిగా , ఒక వంద కటాక్షశతకంగా అమ్మ కళ్ళను గురించి , ఒక వంద మందస్మితశతంగా అమ్మ చిరునవ్వును గురించి, ఒక వంద పాదారావిందశతంగా అమ్మ పాదారవిందాలను గురించి అద్భుతమైన శ్లోకాలతో చెప్పారు.

అమ్మ సంతోషించి, నాయనా నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు ఆ పిల్లవాడు "అమ్మా, నువ్వు అనుగ్రహించిన వాక్కుతో నిన్ను స్తుతించి తరించాను. ఇంక ఈ వాక్కును లౌకికవిషయాలను ప్రస్తావించి అపవిత్రం చేయలేను తల్లీ. నన్ను మళ్ళా యధాప్రకారంగా మూగవాడిని చేయమ్మా" అని అడిగాడు. అమ్మ చిరునవ్వుతో అనుగ్రహించింది.

అప్పటి కంచి శంకరమఠం పీఠాధిపతులు మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు ఈ వృత్తాంతం తెలిసి మహానందంతో ఆ పిల్లవాడిని ఉత్తరాధికారిగా స్వీకరించారు. ఆ పిల్లవాడు కంచిమఠానికి 20వ పీఠాధిపతిగా విరాజిల్లాడు.

చూసారా అమ్మ తాంబూల కబళం మహిమ.

అమ్మ తాంబూల మహిమను గురించి కాళిదాసు గారు తన అశ్వధాటీ స్తోత్రంలో ఏమంటున్నారో చూడండి.

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వన వాటీషు! నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా!
పాటీర గంధి కుచ శాటీ! కవిత్వ పరిపాటీ మగాధిప సుతా!
ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్.

అమ్మ తాంబూలరస మహిమతో గుఱ్ఱముల కంటే వేగంగా పరుగెత్తే ధాటి కల కవిత్వ శక్తి అబ్బుతుందని అంటున్నారు "ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్." అన్న ఆఖరు పాదంలో. మూకశంకరుల వృత్తాంతమే దానికి ఋజువు కదా.

ప్రసిధ్దమైన శ్యామలాదండకంలోనూ కాళిదాసమహాకవి అమ్మను గురించి "కుంద మందస్మితోదారవక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూలఖండోత్కరే జ్ఞానముద్రాకరే, శ్రీకరే" అని వర్ణించారు.

అందుచేత దిగ్దేవతలు చుట్టూ చేరి అమ్మ అనుగ్రహించే తాంబూలకరండం కోసం వేచి ఉంటున్నారు అంటే ఆశ్చర్యం ఏముంది!

శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరీ స్తోత్రంలో అమ్మ తాంబూల మాహాత్మ్యం గురించి ఇలా ప్రస్తుతించారు.

రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్
నివృత్తైశ్చణ్డాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః
విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబళాః

రాక్షసుల్ని జయించి వచ్చారు ఇంద్రుడూ ఉపేంద్రుడూ కుమారస్వామీ సంతోషంగా. వారికి అమ్మ ఆదరంగా తన కర్పూరతాంబూలపు తునకల్ని ఇస్తోందట వాటికోసం వాళ్ళు పోటీపడుతూ లాక్కుంటున్నారట. పోనీ అయ్యవారి  నుండి తాంబూలం గ్రహించడయ్యా పోండి అందామంటే ఆయన గారి తాంబూలం మీద హక్కులన్నీ చండీశ్వరుడివే కాబట్టి అవి వాళ్ళకు అక్కరలేదట. అమ్మ తాంబూల ప్రసాదమే కావాలట.

కుమారస్వామీ, విష్ణువూ, ఇంద్రుడూ కోరి స్వీకరించే అమ్మ తాంబూల ఖండాల కోసం దిగ్దేవతలు చుట్టుముట్టి కాచుకొని ఉంటున్నారు అంటే అది సహజమే కదా.

బహిర్మాతృకాన్యాసంలో అమ్మ జిహ్వకు 'అం' అని బీజంతో న్యాసం.

13, మే 2019, సోమవారం

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 10

అమ్మ స్వరూపాన్ని వశిన్యాదులు బహు చమత్కారంగా వర్ణిస్తున్నారు. ఈ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా అన్న నామంలో అమ్మ పలువరుసను గురించి చెబుతున్నారు.

ఈ నామంలో ద్విజ శబ్దం కనిపిస్తోంది కదా. ద్విజుడు అన్న మాటకు సంస్కృతంలో ప్రచారంలో ఉన్న అర్థం బ్రాహ్మణుడు అని.

కాని ఈ ద్విజ శబ్దం గురించి చాలా చాలా చెప్పుకోవచ్చును. బ్రాహ్మణుడు అనే కాదు దంతాలకు కూడా ద్విజ శబ్దం వర్తిస్తుంది. ఎందుకబ్బా అని మీరు అడగవచ్చును.

ఆసలు ద్విజము అంటే రెండుసార్లు పుట్టినది అని వ్యుత్పత్తి అర్థం.  అదేం మాటండీ, బ్రాహ్మణుడు పుడతాడా యేమిటీ అని మీరు అనవచ్చును. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అని సూక్తి. అంటే బ్రాహ్మణ దంపతులకు పుట్టగానే ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు. ఉపనయనం అన్న సంస్కారం పొందిన తరువాతనే వాడు బ్రాహ్మణుడు. అలాగెందుకండీ అంటే ఉపనయనం లోనే గాయత్రీ మంత్రోపదేశం లభిస్తుంది. ఆ పిమ్మటనే వేదాధ్యయనానికి అధికారం వస్తుంది. అందుకని. ఇది సంప్రదాయికమైన అర్థం. ఈ కాలం వాళ్ళకు ఈమాటలు నచ్చకపోతే అది వేరే విషయం.

నిజానికి ఉపనయనసంస్కారం అనేది త్రైవర్ణికులకు సామాన్యమే ఐనా బ్రాహ్మణులనే ద్విజులు అని సాధారణంగా ఎందుకు సంబోధిస్తారూ అన్న ప్రశ్న వస్తుంది. ఉపనయనంతో పాటే వేదాధ్యయనాధికారమూ త్రైవర్ణికులకు సాంప్రదాయికంగా ఉన్నా, వారికి ఆచార్యత్వం విధించబడలేదు.  బ్రాహ్మణులకు అధ్యయనమూ, అధ్యాపనమూ, దానమూ, ప్రతిగ్రహమూ, యజనమూ, యాజనమూ తప్ప ధనసంపాదనకోసం ఏవృత్తినీ చేపట్టే అధికారం వేదం ఇవ్వలేదు. వారు గురువులుగా ఉండి ప్రజల ఆదరణతో బ్రతుకవలసిందే. అందుకే గురుత్వసిద్ది కారణంగా బ్రాహ్మణులకే ద్విజులు అన్న మాట రూఢంగా వినిపిస్తూ ఉంది.

శాఖాచంక్రమణం ఆపుదాం. ద్విజము అంటే రెండుసార్లు పుట్టినది అని వ్యుత్పత్తి చెప్పుకున్నాం కదా దంతములకు ద్విజత్వం ఏమిటీ అని అనవచ్చును. మరి దంతాలు మనుషులకు రెండు సార్లు వస్తాయి కదండీ జీవితంలో. అందుకే అవి ద్విజములు.

కాబట్టి ఇక్కడ ద్విజపంక్తి అంటే దంతాల వరుస అని అర్థం చెప్పుకోవాలి.

ద్విజపంక్తి ద్వయం అంటే దంతాల వరుసల జత అన్నమాట.

ఉజ్వలంగా ప్రకాశిస్తున్న అమ్మ దంతాల వరుసలు ఎలా ఉన్నాయీ అన్నది ఈ నామం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా అన్న దానిలో చెబుతున్నారు.

అవి శుధ్ధవిద్యాంకురాల్లాగా ఉన్నాయట.

శుధ్ధవిద్య అంటే శ్రీవిద్య.  అంటే అమ్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించే విద్య అని అర్థం. అవిద్యను జయించి జ్ఞానం ప్రసాదించేది శ్రీవిద్యయే కదా అందుకని.

సా భవతి శుధ్ధవిద్యా యే దన్తా హస్తయో రబేధమ్ ఇతి. అన్నిటితోనూ తనకు అబేధబుధ్ధిని కలిగించేదే శుధ్ధవిద్య.  అదే శ్రీవిద్య. అమ్మ మొదట ఈ శ్రీవిద్యను శిష్యులకు స్వయంగా ఉపదేశించింది. అమ్మ నోటనే ఆవిష్కృతం ఐన కర్ణోపదేశంగా లోకంలో వ్యాప్తిచెందింది.  పరా, పశ్యంతీ. మధ్యమా వైఖరీ రూపములలో విద్యను వెలువరించిన మన అమ్మ దంతాలే శ్రీవిద్యకు అంకురాలు

ఒక గింజని భూమిలో పాతామనుకోండి. అది మొక్కగా ఎలా మారుతుందీ చూదాం. మొదట అది ఉబ్బుతుంది. ఈ స్థితిని పరావస్థ అంటారు.  ఉబ్బి ఉబ్బి అది విచ్చిపోతుంది కదా. అది పశ్యంతీ అనే అవస్థ.  విచ్చటం అంటే దానినుండి ఒక చిన్న మొగ్గలాంటిది బయటకు వస్తుంది.  జాగ్రత్తగా చూస్తే అందులో రెండు దళాలుంటాయి. కాని అవి అంటుకొని ఉంటాయి. ఇది మధ్యమావస్థ. కొద్దిగా కాడలా పెరిగి,  ఆ రెండుదళాలు మొల్లగా కొంచెంగా విడిపోతాయి. ఇది వైఖరీ అవస్థ. ఈ అవస్థలో ఉన్న మొక్కకే అంకురం అని పేరు.

శ్రీవిద్య యొక్క పూర్ణదీక్ష ప్రధానవిద్య, షోడశాక్షరీవిద్య, శుధ్దవిద్య అని మూడు రకాలైన బీజ ప్రస్తారాలు కలదిగా ఉంది. అందునా షోడశాక్షరీవిద్యకు కూడా శుధ్ధవిద్య అన్న వ్యవహారం ఉంది. ఈ షోడశికి 16 బీజాలు. ఇవి వైఖరీ స్థితికి అనగా అంకురస్థితికి వచ్చేసరికి 16 x 2 = 32 అక్షరాలు అవుతున్నాయి. 32 విద్యాంకుర దళాలు అమ్మకు 32 దంతాలు అన్నమాట. అంకురస్థితిలో ప్రతిబీజమూ శివ శక్తి విభాగాలుగా రెండుగా అవుతున్నది కాబట్టి 16 బీజాలు 32 అంకురాలుగా అవి అమ్మకు దంతాలుగా చెప్తున్నారు. ఇవన్నీ శ్రీరాజరాజేశ్వరీ మంత్ర వర్ణాలు.

శుధ్దవిద్యాంకురాలు అని చెప్పబడే అక్షరాలు అ, ఇ, ఉ, ఋ, ఌ, క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ, డ, ఢ, ణ, త , థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, స, హ. ఇవే అమ్మకు దంతరూపాలుగా ఈ నామం ద్వారా చెప్పారన్నమాట.

మరొక విధంగా కూడా అన్వయం ఉంది. శుధ్దవిద్యా చ  బాలా చ ద్వాదశార్థా మతంగినీ అని శ్రీవిద్యా మంత్రదీక్షలు 32 రకాలు. ఈ 32 విద్యావిశేషాలే అమ్మకు దంతాల వంటివి అని చెప్పటం. దీక్షల విషయంలో కూడా సాధకుడిని ద్విజుడు అనే అంటారు. ఎందుకంటే మంత్రదీక్షను పొందక మునుపు, మంత్రదీక్షను పొందిన పిదప వేర్వేరు జన్మలుగా లెక్క, అందుకే దీక్షానామం అని వేరే ఉంటుంది. దీక్షను పొందినప్పుడు అంతకు ముందు ఉన్న నామధేయం పోయి గురువులు పెట్టిన సరికొత్త పేరు వ్యవహారంలోని వస్తుంది కాబట్టి దీక్షాపరులు ద్విజులు అవుతున్నారు. ఇలాంటి ద్విజుల పంక్తి ద్వయమే అమ్మకు దంతముల వంటివి అని అన్వయం చెప్పవచ్చును.

ఈ 32 దీక్షలు ఏవి అన్న విషయంలో కొంత చర్చ ఉంది. 32 దీక్షల గురించి భాస్కరరాయలు చెప్పినా వాటిలో కొన్ని కొన్ని స్మృతి శ్రుతి విరుధ్ధం కాబట్టి అలా అంగీకరించటం కుదరదు. సమయ దక్షిణాచారంలో 16 దీక్షామంత్రాలే ఉన్నాయి. ఈ 16 దీక్షామంత్రాలే శివశక్త్యాత్మకంగా అంకురాలుగా గ్రహించి అమ్మకు రెండు పలువరుసలుగా చెప్పటమే వేదసమ్మతంగా ఉంటుంది.

ద్విజపదానికి విప్రులు అన్న అర్థాన్ని గ్రహించి, ఆ విప్రులు వేదవిద్యలను శిష్యపరంపర ద్వారా వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి వారు శుధ్ధవిద్యకు అనగా వేదవిద్యకు అంకురాలు అన్న భావాన్ని ఆలంబనం చేసుకోవటమే ఎక్కువ సముచితంగా ఉంటుంది.  విద్యావహై బ్రాహ్మణ మాజగామ అని శ్రుతి కదా. అమ్మ నిర్మలమైన విద్యాస్వరూపులైన బ్రాహ్మణులచేత పరివేష్టించబడి ఉందన్న తాత్పర్యం ఈ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా నామానికి చెప్పుకోవటం బాగుంటుంది. బ్రాహ్మణోఽస్య ముఖ మాసీత్ అన్న శ్రుతిని బట్టి విరాడ్రూపురాలైన అమ్మకు బ్రాహ్మణోత్తములు వదనమునందు దంతపంక్తులుగా విరాజిల్లుతున్నారన్న తాత్పర్యం గ్రాహ్యం.


7, మే 2019, మంగళవారం

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8

ఈ నామం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా అనే దానిలో ఉన్న పదాల అర్థాలను ముందుగా చూదాం.

నవ అంటే తాజాగా ఉన్న అని అర్థం.
విద్రుమం అంటే పగడం.
బింబం అంటే దొండపండు
న్యక్కారం అంటే తిరస్కారం. ఛీకొట్టటం అన్నమాట.
రదనం అంటే దంతము. అనగా పన్ను.
ఛదము అంటే ఆఛ్ఛాదనము అనగా కప్పు.
రదనఛ్ఛదము అంటే దంతములను కప్పి ఉంచేది. అనగా పెదవి అని అర్థం.

ఈ నామంలో ప్రస్తావించిన విద్రుమమూ, బింబమూ రెండూ ఎఱ్ఱనివి. ఇక్కడ వాటికి రెండింటికీ అన్వయించే విధంగా నవ అన్న పదం ముందుగా జోడించారు కాబట్టి తాజా పగడాలూ దొండపండ్లూ అని గ్రహించాలి.

తాజా దొండపండు అంటే తెలుస్తుంది. దొండకాయ బాగా పండితే అది చాలా ఎఱ్ఱగా ఉంటుంది. అది.

కాని తాజా పగడం ఏమీటీ అనవచ్చును. తాజా పగడం అంటే అప్పుడే మెరుగుపెట్టిన పగడం అన్నమాట. ఏ మాలిన్యమూ అంటని దానికి మంచి శోభ ఉంటుంది.

ఈ రెండింటి యొక్క అరుణిమనూ కూడా అమ్మ పెదవులు త్రోసివేస్తున్నాయని ఈ నామం తాత్పర్యం. అమ్మ పెదవులు సర్వకాలాల్లోనూ సహజమైన గొప్ప అరుణిమను కలిగి ఉంటాయని చెప్పటం ఈ నామం ఉద్దేశం.

పరోక్షంగా దొండపండు శోభ కొంచెమే, అదీ కొద్దికాలమే. ఎంత అందంగా మెరుగుపెట్టిన పగడం ఐనా అది గాలిలోని దూళిని పట్టుకొని కాంతిహీనం అవుతుంది మెల్లగా.  కాని అమ్మ పెదవుల సౌందర్యం కాలాతీతమైనది అని స్పష్టం చేయటం అన్నమాట.

శంకరభగవత్పాదుల సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ 62వ  శ్లోకం చూడండి.

ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దన్తచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా
న బిమ్బం తద్బిమ్బప్రతిఫలనరాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా

ఇక్కడ శంకరులు అమ్మను ఉద్దేశించి అంటున్నారు. చక్కటి పళ్ళ వరుస ఉన్న తల్లీ!, నీ పెదవులు స్వభావసిధ్ధంగానే కెంపులవలె రక్తవర్ణంలో ఉన్నాయి. వాటిని మరి వేటితోనూ పోల్చటం కుదరదు.

నీ క్రిందిపెదవికి సహజమైన కాంతి ఉన్నది. అది పగడపు తీవకు పండు కాస్తే ఆ పండు ఎలా ఉంటుందో అలా ఉంది. కాని ఏంచేసేదీ, పగడపు తీగ అంటారే కాని అలాంటి తీగ లేదు. పగడాలు తీగలకి కాయవు. అవి పండటం మరింత అబధ్ధం.

పోనీ దొండపండుతో పోలుద్దాం అనుకుందాం.  దొండపండు ఎఱ్ఱగా ఉన్నా అది కాంతిమంతంగా ఉండదే. అసలు దొండపండును బింబం అంటాం. బింబం అంటే ప్రతిబింబించేది అని కదా వ్యుత్పత్తి?  ఆ దొండపండుకు బింబం అన్న పేరు రావటానికి కారణం అది నీ అధరాలను ప్రతిబింబించటం వల్లనే కాని దాని గొప్ప యేం లేదు.

అంటే శంకరుల ఆలోచనకు పిండితార్థం, అమ్మ పెదవుల శోభను పోల్చటానికి మనకు వేరే వస్తువు లోకంలో లేదు అని.

మహాకవి కాళిదాసు గురించి తెలుసును కదా? ఆయన అమ్మపై చేసిన శ్యామలాదండకం జగత్తులో మహా ప్రసిధ్ధికి ఎక్కినది.  అందులో ఆయన

కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

అని అన్నారు. ఇక్కడ శోణాధరే అన్నదానికి అర్ధం ఎఱ్ఱని పెదవులు కల తల్లీ అనే.  పక్వబింబాధరే అని ముక్తాయించి చెప్తున్నారు కదా పక్వబింబం అంటే చక్కగా పండిన దొండపండు అని. ఈ పక్వ అన్న మాటమీద నవత్వాన్ని ఆరోపించుకొనవచ్చును.

అమ్మ పెదవుల అరుణిమ సహజమైనది. ఆ అరుణిమతో అమ్మ స్మేరశోణాధరే అనగా చిన్నగా నవ్వుతున్న తల్లి అని అర్థం.

పెదవుల్లో పైపెదవికి విద్రుమం అనీ క్రిందిపెదవికి బింబం అనీ సంజ్ఞలు ఉన్నాయట.

బహిర్మాతృకాన్యాసంలో పెన క్రింద పెదవులకు ఏ ఐ అన్నవి న్యాసబీజాలు.

23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8

పద్మరాగ మణుల గురించి మనం ఇప్పటికే చదువుకున్నాం 14వ నామం ఐన కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న దాని వ్యాఖ్యలో.

ఈ పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్న నామంలో పరిభావము అనే పద విశేషం ఉంది. పరిభావం అన్నా పరాభవం అన్నా ఒక్కటే.  పరిభావి అంటే పరాభవించేది అని అర్థం.

పరిభావి కపోలభూః అన్నారు. కపోలము అంటే చెక్కెలి.  దీనిని బట్టి అమ్మ నామం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్నది అమ్మ చెక్కిళ్ళకు సంబంధించినది అని తెలుస్తోంది కదా.

ఆదర్శం అన్న మాటను మనం తరచుగానే వింటూ ఉంటాం. ఇక్కడ ఆదర్శం అన్న మాట ఎక్కడుందంటారా?  శిలాదర్శ అన్నమాటను విడదీసి చూస్తే అది శిలా + ఆదర్శ అన్న మాటల కలయిక అని తెలుస్తుంది సులువుగానే.  శిల అంటే రాయి. ఇది మామూలు రాయి కాదు. పద్మరాగశిల అందుకే పద్మరాగశిలాదర్శ అన్నారు.

ఇంక ఆదర్శం అంటే అర్థం అద్దం అని!

సరే ఇంక ఈ నామం చెప్పే భావం ఏమిటో తెలుసుకుందాం.

పద్మరాగాలు మణులు. కాని మణులూ శిలావిశేషాలే. అందుకే పద్మరాగశిలా అన్నారు. ఈ శిలలు ఎంతో నున్నగా ఉంటాయి. అంటే చక్కగా అద్దాల్లాగా అన్నమాట. అద్దాల్లాగా ఉండటం అంటే వాటిలో మన బొమ్మ చూసుకోవచ్చును. అంత నున్నగా ఉంటాయి.

అద్దాల్లాగా ఉన్న పద్మరాగశిలలు ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.

ఐతే వాటి కన్నా గొప్పవి ఉన్నాయి లెండీ, వాటి గొప్ప ఒక లెక్కా అంటూన్నారు.

అమ్మ చెక్కిళ్ళూ ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.

వాటి ముందు ఆ పద్మరాగ శిలల అద్దాలు దిగదుడుపే అంటున్నారు వశిన్యాదులు స్తోత్రం చేస్తూ అమ్మని. అమ్మ చెక్కిళ్ళ అరుణిమ ముందు పద్మరాగా లేపాటీ, అమ్మ చెక్కిళ్ళ నున్నదనం ముందు ఆ పద్మారాగా లేపాటీ అని పద్మరాగాలను అమ్మ చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయి అని చెప్తున్నారు.

పద్మరాగశిలలను అద్దాల్లాగా సానబడితే ఆ అద్దాల్లో మన ప్రతిబింబం చూసుకోవచ్చునే. మరి అంతకు మించినవి  అమ్మ చెక్కిళ్ళు అని అంటున్నారు చూడండి, ఆ అనటంలో ఒక చమత్కారం ఉంది. అమ్మ చెక్కిళ్ళనే అద్దాల్లో కామేశ్వరుడి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందని ఆ చమత్కారం.

మంచి వయస్సులో అంటే నిండుయౌవనంలో ఉన్న అమ్మాయి చెక్కిళ్ళి కించిత్తుగా ఎరుపుదనం కలిగి ఉండటం సహజం.  అందులోనూ అందమైన అమ్మాయి ఐతే ఇంక చెప్పేదేముందీ? ఇంక మృదుత్వమా సరేసరి.

అమ్మ సర్వలోకాల్లోనూ ప్రతిలేని సౌందర్యరాశి.

ఆవిడ నిత్యయౌవన మూర్తి.

అందుచేత ఆవిడ చెక్కిళ్ళు మరెంత మృదువుగా ఉంటాయీ? మరెంత ఎఱ్ఱగా ఉంటాయీ? మీరే ఊహించుకోండి.

అన్నట్లు, నిత్యయౌవనా అన్నది కూడా అమ్మ సహస్రనామాల్లో ఒకటి. ఇది ముందుముందు వస్తుంది 430వ నామంగా.

అమ్మ యజ్ఞకుండం నుండి ఆవిర్బవించిన సమయంలో తల్లి ముఖ మండలం కామేశ్వరుడి తేజస్సుతో ఏర్పడింది. అందుచేత అమె చెక్కిళ్ళలో కామేశ్వరుడే దర్శనీయుడు కావటం సూచితంగా ఉండటం మనోహరంగా ఉంది.

అమ్మ ముఖమండలాన్ని ధ్యానం చేసే భక్తులకు అమ్మ ముఖదర్శనంతో బాటే కామేశ్వరదేవుడి దర్సనమూ అవుతున్నది అన్నది మనం గ్రహించవలసిన  రహస్యం.

శ్రీవిద్యలో బహిర్మాతృకాన్యాసంలో కుడి ఎడమ కపోలాలకు ల, లూ అనేవి న్యాసాక్షరాలు.

5, మే 2019, ఆదివారం

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా

కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా 8

తాటంకము అంటే చెవికమ్మ. యుగళం అన్నారు కాబట్టి వాటి జంట. ఈ తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న నామంతో అమ్మ యొక్క చెవికమ్మలను వర్ణిస్తున్నారు వశిన్యాదులు.

తపనుడు అంటే సూర్యుడు. తన తీక్షణమైన తేజస్సుతో జీవులను తపింపజేస్తాడు కాబట్టి సూర్యుడికి అలా తపనుడు అన్న పేరు వచ్చింది.

ఉడుపుడు అంటే చంద్రుడు. ఉడు అన్న సంస్కృత శబ్దానికి అర్థం నక్షత్రం అని. ప అనే ప్రత్యయం ఆధిపత్యాన్ని చెప్పేది. అందుచేత ఉడుప అంటే నక్షత్రాలకు అధిపతి. నక్షత్రాలు రాత్రి మాత్రమే మనకు కనిపించేవి. ఆకాశం నిండా నక్షత్రమండలాలూ వాటినిండా నక్షత్రాలూనూ. కాస్త చీకటి రాత్రి కనుక ఐనట్లైతే వాటి ధగధగలతో ఆకాశం ఎంత శోభాయమానంగా ఉంటుందంటే ఆ శోభను తిలకించటం అనే ఆనందం ఉందే, అది అనుభవించవలసిన ఆనందమే కాని మాటల్లో చెప్పలేం. రానురాను నగరాల్లోని దీపకాంతులు వెదజల్లే వెలుగుల మధ్య నుండి నక్షత్రాలను తిలకించటం దుస్సాధ్యంగా ఉంటోంది. దీన్ని కాంతి కాలుష్యం అనుకోవచ్చును. అంతరిక్షం నుండి చూస్తే నగరాలన్నీ ఈ కాంతికాలుష్యకాసారాలుగా కనుపిస్తున్నాయి.

ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఆరుబయటకు మారేవి ప్రక్కలు. మదత మంచాలు వేసుకొని చుట్టు ఉన్న చెట్లనుండి అప్పుడప్పుడూ వచ్చి పలికరించే కాస్త చల్లని గాలుల్లో సేదతీరుతూ నిద్రించే వాళ్ళం. నిద్రప్టట్టే దాకా ఆకాశంలోని నక్షత్రాలను చూడటం ఒక అందమైన వినోదం. ఈ కాలంలో అది అసాధ్యం ఐపోయింది కదా. ఇంకా నాగరీకం ముదరని పల్లెలు ఉంటే అక్కడ ఈ ఆనందం వెతుక్కోవచ్చు నేమో. అలా వెలుగుచుక్కల ముగ్గుల శోభలతో మురిపించే అకాశంలో చందమామ మరొక ఆనందం. ఆ చందమామను చూస్తూ ఎంతసేపన్నా వినోదించవచ్చును.

ఆకాశం నిండా నక్షత్రాలూ వాటి మధ్యన చందమామ. ఆ నక్షత్రాలకు ఒక రాజుగా వెలుగుతూ ఉంటాడు చంద్రుడు. పురాణాల ప్రకారం నక్షత్ర కన్యలకు భర్త కద చంద్రుడు. అందుకే చంద్రుడు ఉడుప పదంతో సంబోధించబడతాడు.

ఈ నామం తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న దానిలో మండలా అని చెప్పారు కదా, దానికి అన్వయం తపన మండలా ఉడుప మండలా అని సూర్యచంద్ర బింబాలను రెండింటికీ వర్తిస్తుంది.

అమ్మకు చెవి కమ్మలు రెండున్నాయి కదా. వాటిలో ఒకటి సూర్యబింబం మరొకటి చంద్రబింబం అని ఈ నామం తాత్పర్యం. అమ్మకు సూర్యచంద్రులు దుద్దుల జత అన్నమాట!

అమ్మ బ్రహ్మాండమే ఆకారమైన తల్లి. కాబట్టి ఆవిడకు సూర్యచంద్రులు చెవిదుద్దులు అంటే బహుసొగసుగా ఉంది.

అమ్మకు వారే నేత్రాలు కూడా అని వేదవాక్యం.

సూర్యచంద్రస్తనౌ దేవ్యా స్తావేవ నయనౌ స్మృతౌ
ఉభౌ తాటంకయుగళ మిత్యేషా వైదికీ శృతి.

అందుచేత ఆ సూర్యచంద్రులు అమ్మకు కళ్ళు. వాళ్ళు అమ్మకు చెవిదుద్దులు. వాళ్ళే అమ్మకు స్తనయుగళం కూడా.

అమ్మ పరాశక్తి. కాబట్టి ఆవిడ సూర్యచంద్రుల్నే చెవిదుద్దులుగా  ధరించ గలిగినది. వేరే దేవతలకు వల్లకాదు.

ఈ నామం అమ్మ విరాడ్రూపి అన్నది మనని స్మరించ మని ప్రబోధిస్తున్నది.

చెవికమ్మలు స్త్రీలకు సౌభాగ్య వర్ధకాలు. అసంగతిని పురస్కరించుకొని మన శంకరభగవత్పాదులు చెప్పిన సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ శ్లోకం పరికించండి.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః
కరాలం యత్ క్ష్వేలం కబలితవతం కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్కమహిమా!!

బ్రహ్మేంద్రాదులు అమృతం సేవించి జరామరణాలను దూరంగా ఉంచగలుగుతున్నారు. కాని కాలం అనేది వాళ్ళనూ వదలదు. (వాళ్ళకీ లయం కావటం అన్నది ఉన్నది!)  ఇకపోతే మీఆయన అమృతం తాగనే లేదే. సరికదా, పైగా పరమభయంకరమైన విషాన్ని తాగాడు. ఐనా చిత్రం ఆయన కాలానికి ఎన్నడూ లొంగడు. ఎప్పుడూ ఉండేవాడై సదాశివుడు అనిపించు కుంటున్నాడు. ఇదంతా సౌభాగ్యకారకాలైన నీ చెవికమ్మల మహిమయేకదా అమ్మా అంటున్నారు ఈ శ్లోకంలో శంకరులు.

ఈ శ్లోకం మహిమను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది అమ్మల సౌభాగ్యాన్ని ఈ శ్లోకపారాయణం రక్షించింది అని పెద్దలు నిత్యం చెబుతూ ఉంటారు.  నమ్మని వారికి దేనివలనా ప్రయోజనం ఉండదు. నమ్మిన వారు ఈ శ్లోకాన్ని నిత్యపారాయణం చేసి సత్ఫలితాన్ని పొందుదురు కాక.

తమిళనాట తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది. అక్కడ పార్వతీ అమ్మవారు అభిరామి అనే పేరుతో కొలువై ఉంది. అమ్మ దేవాలయంలో నిత్యం అమ్మను ధ్యానిస్తూ ఉండే ఒక భక్తుడు అభిరామ భట్టర్. నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్.

ఒకరోజున అమ్మ దర్శనానికి విచ్చేసిన శరభోజీ మహారాజు గారు ఈ ధ్యాననిమగ్నుడై తనని గమనించకుండా ఉన్న అభిరామ భట్టర్ గారిని చూసి కొంచెం ఆగ్రహం చెందుతాడు. సాధారణంగా రాజు కాని రాజకుటుంబం కాని వచ్చినప్పుడు భద్రత నిమిత్తం ఆలయం ఖాళీ చేయిస్తారు. అర్చకులు తప్ప గుడిలో ఎవర్నీ ఉండనివ్వరు. ఐతే గుడిలో అయ్యరు ఉండటమే కాక తనని పట్టించుకోలేదు! ఆగ్రహం రాదూ మరి?

అక్కడి అర్చకులు పరిస్థితిని చక్కదిద్దటానికి గాని ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక పిచ్చివాడిలాగా ఎప్పుడూ అక్కడే అమ్మని ధ్యానిస్తూ కూర్చుంటాడనీ, ఎవర్నీ పట్టించుకోడనీ తామూ అతడి ఉనికిని పట్టించుకోమనీ ఆగ్రహించవద్దనీ మనవి చేసారు రాజుగారికి.

సరే ఇతని సంగతి ఏమిటో కనుక్కుందాం అనుకొని రాజుగారి సరాసరి సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరకు వెళ్ళి పలకరించాడు. కొంచెం ధాటీగా మాట్లాడినట్లున్నాడు. అయ్యరుకు ధ్యానభంగం ఐనది. అంతవరకూ అమ్మ ముఖారవిందాన్ని తిలకిస్తూ మైమరచి ఉన్నాడేమో ఉలిక్కిపడి చూసాడు రాజును.

"ఈరోజు తిథి ఏమిటి" రాజుగారు ప్రశ్నించారు.

వెంటనే అన్నాడు అయ్యరు "పౌర్ణమి" అని.

అందరూ నిర్ఘాంతపోయారు. రాజు ఐతే ఉగ్రుడే అయ్యాడు.

"అలాగా. సంతోషం. ఈరోజు రాత్రికి వస్తాను. నాకు నిండు చంద్రుణ్ణి చూపించండి" అని ఆజ్ఞాపించి చక్కాపోయాడు.

చుట్టూ ఉన్న అందరూ కంగారుగా, "ఎంత పని చేసావయ్యా, ఈరోజు అమావాస్య!" అని సుబ్రహ్మణ్య అయ్యరుతో అన్నారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా ఆశ్చర్యపడి, జరిగిందేదో జరిగింది. అంతా అమ్మ చూసుకుంటుంది అని నిబ్బరంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో అని అర్చకులూ ఊరిజనమూ అందరూ ఆందోళన పడ్డారు. సాయంత్రానికి గుడివద్ద జనం గుమిగూడారు.

రాత్రి అయ్యింది. రాజుగారు మళ్ళా గుడికి వచ్చారు. ఈసుబ్రహ్మణ్య అయ్యర్ సంగతి ఏమిటో చూదామనే వచ్చారు. ఆయన వచ్చేసమయానికి తన్మయత్వంతో అయ్యరు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు.  అ స్తోత్రం అద్భుతంగా ఉంది. దాన్ని అంత్యాది అంటారు. అంటే ఒక చరణం ఏ మాటతో ముగుస్తున్నదో, దానితోనే తరువాతి చరణం చెప్పుతూ ఉండాలి. ఇలా నడుస్తోంది స్తోత్రం. ఈ అంత్యాదిని తమిళులు అందాది అంటారు. రాజుకు అశ్చర్యం అనిపించింది. ఈయన ఇంతటి కవీ భక్తుడూ అని ఆయనకు ఇంతవరకూ తోచనే లేదు.

సుబ్రహ్మణ్య అయ్యర్ అంత్యాది చెబుతూనే ఉన్నారు మైమరచి. 78 పద్యాలు పూర్తి ఐనవి. అప్పుడు మరొక అద్భుతం జరిగింది. నిండు చంద్రుడు ఉదయించాడు. అమావాస్య కాస్తా పున్నమిగా మారిపోయింది. వెన్నెల వెలుగులతో ఇలాతలం నిండిపోయింది.

జనసమూహం హర్షద్వానాలతో ఇలాతలం మార్మోగింది.

అంత్యాది స్తోత్రం నూరు పద్యాలతో ముగించి పరమానందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ మన లోకం లోనికి వచ్చాడు.  కనులు తెరచి చూస్తే తన పాదాల వద్ద కన్నీళ్ళతో రాజు గారు.

" అమావాస్యను పౌర్ణమిగా మార్చగలిగిన మీరు మహామహిమాన్వితులు. తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి" అన్నాడు రాజు.

సుబ్రహ్మణ్య అయ్యర్ తన తలను అడ్డంగా ఆడించి. "మహా మహిమాన్వితురాలు అమ్మ. నాకే మహిమలూ లేవు. నా తలను కాచాలనే, నాకేసి చిరునవ్వుతో చూస్తూ,  అమ్మ తన చెవి కమ్మ ఒకదాన్ని ఆకాశంలోని ఎగురవేసింది. అదే నిండుచంద్రుడిలా వెన్నెల వెలుగులు కురిపించుతోంది" అన్నాడు.

మహారాజు ఆనందాశ్చర్యాలకు పట్టపగ్గాలు లేవు. ఈరోజునుండీ తమరు సుబ్రహ్మణ్య అయ్యర్ కాదు అభిరామ భట్టర్ అని అయ్యరుకు కొత్త పేరు పెట్టి గౌరవించి ఆయన పాదాలకు వంగి నమస్కారం చేసాడు. నిజానికి సాష్టాంగ నమస్కారం చేసే వాడే , కాని దైవసన్నిధానంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికీ అలా చేయరాదు కదా.

అబిరామ భట్టు కారణంగా ఈసూర్యచంద్రులే అమ్మ తాటంక యుగళం అన్నది ఋజువైనది.

1, మే 2019, బుధవారం

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా


కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా  8





ఈ కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా అన్న నామంలో వశిన్యాదులు అమ్మ తన చెవులపైన చేసుకున్న అలంకరణ గురించి చెబుతున్నారు.

కదంబం అంటే కడిమిచెట్టు. దీనికి రుద్రాక్షాంబ అని కూడా పేరుంది. మంజరి అంటే ఇక్కడ గుత్తి అని అర్థం. అందుచేత కదంబమంజరి అంటే కడిమి పూల గుత్తి. కొన్ని కొన్ని చెట్లకు పూవులు గుత్తులుగానే కాస్తాయి. మనం బంతిపూవు అనేది కానీ చేమంతిపూవు అనేది కాని నిజానికి ఒక పూలగుత్తి. బంతిపూవులో ప్రతి ఒక్క రేకా ఒక పువ్వు నిజానికి. అలాగే కడిమిచెట్టుకు కూడా గుండ్రటి ఆకారంలో గుత్తులు పూస్తాయి. అందుకే కదంబమంజరి అన్నారు. చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి  ఎక్కువగా పూస్తుంది.

కర్ణములు అంటే చెవులు. కర్ణపూరములు అంటే చెవులకు తగిలించుకొన్న చెవికమ్మలు. అమ్మ తన రెండు చెవులపైనా కడిమిపూల గుత్తుల్ని అలంకరించుకొన్నది. ఇక్కడ నామంలో క్లప్తము అన్న శబ్దం కనిపిస్తోంది కదా దాని అర్థం ఏమిటీ అంటే ఏర్పరించటం అని. అంటే చెవులకు అలంకరించటం అన్నమాట. ఆ అలంకరణ చాలా మనోహరంగా ఉంది అని అంటున్నారు. ఐతే ప్రసిధ్ధ దేవీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు కొంచెం విశేషంగా చెప్పారు. "కడిమిచెట్టు పూలగుత్తి యెడమచెవియందు నలంకరించుకొనియుండును. ఇది కర్ణపూరము. స్త్రీకి ఎడమ, పురుషునకు కుడి భాగములు ముఖ్యములు. ఇట్లు స్త్రీపురుషసంయోగమే అర్ధనారీశ్వరత్వము అగుచున్నది. కావున స్త్రీలు ఎప్పుడును ఎడమనుండి అలంకరించుట ప్రారంభించవలయును. " అని.

మన సాహిత్యంలో ఈ కడిమిచెట్టు తరచుగానే ప్రస్తావనకు వచ్చింది.

తిలక్ అని ప్రసిధ్ధి చెందిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒక కవితలో "ఆకు ఆకునీ రాల్చింది కడిమిచెట్టు" అంటాడు. నిజానికి కడిమిచెట్టు ఆకురాలుకాలంలో కూడా ఆకులు రాల్చదు. విశ్వనాథ సత్యనారాయణ గారు కవిసామ్రాట్టు. ఆయన కడిమిచెట్టు అన్న పేరుతో ఒక నవలనే వ్రాసారు.

కడిమిచెట్టు పూవులు శివుడికీ అమ్మకూ కూడా ఇష్టమైనవి. కుమారస్వామికి కూడా ఇష్టమైనవట. అవి శ్రీకృష్ణుడికీ ఇష్టమైనవే నట. ఈవిషయాలు మన పౌరాణిక సాహిత్యంలో తెలియవస్తున్నాయి.

పరమాత్ముడు బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన లీలల్లో గోపికావస్త్రాపహరణం ఒకటి. అమ్మాయిల బట్టలెత్తుకొని పోయి ఆ పిల్లవాడు ఏ చెట్టుని ఎక్కి కూర్చున్నాడనుకున్నారు? కడిమిచెట్టు. ఆ స్వామి కాళీయుడి పడగలమీద తాండవం చేయటం కోసం ఒక చెట్టు ఎక్కి దానిపై నుండి కాళింది మడుగులోనికి దూకాడు - అదేమి చెట్టనుకున్నారు? కడిమి చెట్టు.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట గోపికావస్త్రాపహరణలీల గురించి. గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తున్నారు. కాని దిగంబరంగా జలక్రీడకు దిగారు మడుగులోనికి. అదీ కదంబవృక్షం ఎదురుగా. కదంబవృక్షం అమ్మవారికి సంబంధించినదే కాదు అమ్మ స్వరూపమే. ఆగ్రహించి వారికి బుధ్ధిచెప్పిన బాలకృష్ణుడికీ అమ్మవారికీ అబేధం. అమ్మవారు నారాయణుడి చెల్లెలు నారాయణి. పురుషుడిగా ఆ బ్రహ్మమే నారాయణుడు. స్త్రీరూపంగా భావిస్తే ఆవిడ నారాయణి. అందుకే కృష్ణుడు వాళ్ళతో కాత్యాయనీ వ్రతం కల్ల చేస్తున్నారని ఆక్షేపించాడు.

భగవద్గీతలోనూ కదంబవృక్షం ప్రస్తావన ఉంది.

హనుమంతుడి జన్మవృత్తాంతానికి కడిమి చెట్టుతో సంబంధం ఉందట. వివరం తెలియదు.

వామన పురాణంలో కూడా ఈ కడిమి చెట్టు ప్రసక్తి వస్తుంది.  మాఘమాసంలో శివపూజను గురించి

మాఘేకుశోదకస్నానం మృగమదేన చార్చనమ్‌
ధూపఃకదంబనిర్యాసో నైవేద్యం సతిలోదనమ్‌

అని చెప్తున్నది పురాణం. కడిమిచెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి అని ఇక్కడ కనిపిస్తున్నది.

ఈ కదంబవృక్షం అనగా కడిమిచెట్టు పూలు తెల్లగానో కాషాయవర్ణంలోనో ఉంటాయి. కొంచెం పసుపురంగు కూడా కలిగి ఉంటాయి. చాలా మంచి సువాసనగా ఉంటాయి. అంతే కాదు వాటి పరిమళం కొంచెం మత్తును కలిగించేదిగా కూడా ఉంటుంది. కడిమిచెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది అని ఒక నానుడి. నిజం కాకపోవచ్చును.

కదంబ అన్న శబ్ధంలో కొందరు ఒక విశేషాన్ని ఇక్కడ గమనించారు. అది చూదాం.

సంస్కృతంలో సంఖ్యలకు చిహ్నంగా మాటలను వాడటం అని ఒక ప్రసిధ్ధమైన పధ్ధతి ఉంది. దాన్ని కటపయాది విధానం అంటారు. దాని ప్రకారం క = 1 దం = 8 బ = 3 అవుతుంది. కాబట్టి కదంబ పదానికి 183 అన్న సంఖ్యవస్తుంది. ఇది ఒక ఆయనం ప్రమాణం. అంటే దక్షిణాయనం లేదా ఉత్తరాయణం దినప్రమాణం 183 రోజులు. కుడి ఎడమ చెవుల్లో అమ్మ కదంబాలు ధరించింది కాబట్టి ఆ అలంకార విశేషాన్ని సంవత్సరంలోని రెండు ఆయనాలకూ సంకేతంగా గ్రహించాలి అని వారి వివరణ. కాని ఈ వివరణ శుధ్ధతప్పు. ఎందుకంటే ఇలా సంఖ్యలను మాటల ద్వారా వ్యక్తీకరించే సందర్భాల్లో ఒక నియమం అంకానామ్ వామతో గతిః అని. అంటే సంఖ్యలో వచ్చే అంకెలను కుడినుండి ఎడమకు వేసుకొంటూ పోవాలి. అందువలన నియమం ప్రకారం కదంబ అన్నది 183 అన్న అంకెలను ఇస్తుంది కాని సంఖ్యగా 381 అవుతుంది.

పూర్వం విష్ణువు గార్దభాసురుణ్ణి సంహరించిన కథ ఒకటి ఉంది. శివుడిని మెప్పించి అందరు రాక్షసుల్లాగానే వాడూ వరం సంపాదించుకొని దేవతలని తిప్పలు పెట్టాడు. ఇంద్రుణ్ణే తరిమేసాడు స్వర్గం నుండి. వాడికి నేలమీదనూ, నరమృగాదుల వల్లనూ శివుడి వరం కారణంగా చావు లేదు మరి. విష్ణుమూర్తి మోహినీదేవి రూపంలో రాగా వాడు అమె వెంటబడ్డాడు. అప్పుడు విష్ణువు సమయం చూసి వాణ్ణి అకాశంలోని ఎగురవేసి తోడేలు  తల, మానవశరీరం కల రూపం ధరించి అంతరిక్షంలోనే యుధ్ధం చేసి సంహరించాడు. ఆసమయంలో పార్వతీదేవి కదంబవృక్షంగా అవతరించి అగ్నిజ్వాలలను చిమ్మి ఆ గార్దభాసురుడి సైన్యాన్ని నిర్మూలించింది.

అమ్మకు కదంబాలు అంటే మిక్కిలి ప్రీతి. కదంబవనవాసినీ అని కాళిదాసుగారు అమ్మను సంబోధించటం తెలుసు కదా. ఆయన చెప్పిన దేవీ అశ్వధాటీ స్తోత్రంలో కదంబాల ప్రసక్తి పదేపదే వస్తుంది. లలితాసహస్రనామ స్తోత్రంలోనూ ఈ కదంబం ప్రసక్తి ఈ నామంలోనే కాక కదంబవనవాసినీ అనీ కదంబకుసుమప్రియా అనీ వస్తుంది.

కదంబానికి సంస్కృతంలో నీపలత అని ఒక పేరు. నీఞ్ ప్రాపణే అన్న విగ్రహవాక్యం కారణంగా నీపము అంటే తన దగ్గరక్ చేర్చుకొనేది అని వ్యుత్పత్తి.  అమ్మకు కర్ణాభరణంగా ఉన్న నీపమంజరి సాధకులమైన మనను అమ్మ దగ్గరకు చేరుస్తున్నది అని భావం ఇక్కడ ద్యోతకం అవుతున్నది.


30, ఏప్రిల్ 2019, మంగళవారం

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా 7

అమ్మ నాసికను గురించి వశిన్యాదులు సెలవిస్తున్నారు. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా అన్న నామంతో అమ్మ ముక్కుదూలం అప్పుడే విచ్చుకుంటున్న సంపంగిపూవు లాగా ఉందని చెప్పారు.

ఈ తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా అన్న నామంలో అమ్మ పెట్టుకున్న ముక్కుపుడక గురించి చెబుతున్నారు. ఈ నామంలో ఉన్న నాసాభరణం అన్న మాటకు ముక్కుపుడక అని అర్థం. దానినే అడ్డబాస అనీ బులాకీ అనీ కూడా అంటూ ఉంటారు.

ఈ అడ్డబాసను ఎలా తయారు చేస్తారంటే దానిలో పైన మాణిక్యం ఉంటుంది, క్రింది భాగంలో మంచిముత్యం వ్రేలాడుతూ ఉంటుంది.

ఈ నాసాభరణం ఎట్లా ఉందీ అంటే అది తారాకాంతిని తిరస్కరిస్తోందట. అవును మరి అమ్మ అలాంటి ఇలాంటి ముక్కుపుడక ఎందుకు పెట్టుకుంటుందీ? ఆ ముక్కుపుడక ఎంతలా ప్రకాశిస్తోందీ అంటే దాని వెలుగు జిలుగుల ముందు నక్షత్రాల తళుకుబెళుకులు బలాదూరు అంటున్నారు!

అలాంటి తారాకాంతి తిరస్కారి ఐన నాసాభరణం ధరించి అమ్మ చాలా భాసురంగా ఉన్నదట. భా అంటే కాంతి. అమ్మ భాసురంగా ఉండేందుకు ఆ ముక్కు పుడక అనేది కొంత దోహదకారి అని తాత్పర్యం తీసుకుందామా? అదంత ఉచితంగా అనిపించదు నాకు. మరెలా అన్వయం అని ప్రశ్న వస్తుంది. అమ్మ సహజంగానే వెలుగులకే వెలుగు. ఆ వెలుగుల్లో అవిడ ముక్కుపుడక యొక్క వెలుగు భాసురంగా అంటే ప్రస్ఫుటంగా ఉండి తారకల యొక్క కాంతినే ధిక్కరిస్తున్నది అని చెప్పుకోవాలి మనం.

ఈ తారాకాంతి అన్నప్పుడు మనం తారకలు అనగా నక్షత్రాల యొక్క కాంతి అని చెప్పుకున్నప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రసమాహారం అంతటినీ చెబుతున్నాం. అలా చెప్పటం సహజంగానూ సొగసుగానూ ఉంది నిజమే.

కొందరు తారా అని చెప్పబడినవి రెండు తారలు అని అభిప్రాయ పడ్డారు. అవి శుక్రతార, కుజతార అన్నవి. నిజానికి ఇవి రెండూ శుక్ర మంగళ గ్రహాలు కాని తారలు కావు. జ్యోతిష సంప్రదాయంలో పంచతారాగ్రహాలు అని సూర్యచంద్రులని మినహాయించి మిగిలిన వారగ్రహాలైన కుజ, గురు, శని, బుధ, శుక్ర గ్ర్తహాలను చెప్పటం ఆనవాయితీ. అలా ఎందుకూ అంటే అవి ఆకాశంలో తారలవలె చాలా చిన్నగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి కాబట్టి. జాగ్రత్తగా గమనిస్తే ఈ తారాగ్రహాలు దృష్టికి ఆనిన సందర్భాల్లో అవి చాలా ప్రకాశంతో ఉంటాయి. పైగా అవి నక్షత్రాల్లాగా మిణిక్కు మిణుక్కు మనవు. ఆకారణంగా వాటి కాంతి మరింత స్ఫుటంగా కూడా ఉంటుంది.

జాతకపధ్ధతిలో, అందులోనూ ముఖ్యంగా స్త్రీ జాతక విషయంగా మంగళ శుక్ర గ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత అందరరికీ తెలిసిందే.

ఇక్కడ ధరించిన బులాకీలో మణిపూసల్లాగా ఉన్నవి ఈ రెండు తారలూ అని తాత్పర్యం. ముక్కుకు రెండువైపులకూ రెండు మణులు ఆ బులాకీలో ఆభరణవిశేషంగా ఉన్నాయి అని కొందరు అభిప్రాయ పడ వచ్చును కాని బులాకీలలో ఇందాక చెప్పినట్లు మాణిక్యమూ దాని క్రింద ముత్యమూ ఉండటమే సాధారణం.

వాటిలో ఒకటి మంగళతార అన్నాం కదా, అది రక్త బిందు వర్ణ సంకేతం. అంటే ఎఱ్ఱనిది. అది పగడపు మణి వంటిది. మరొకటి శుక్రతార అన్నాం కదా, శుక్ల బిందు వర్ణసంకేతం. అంటే స్వఛ్ఛమైన తెల్లని రంగుది. అది వజ్రము వంటిది. ఈ రక్తశుక్ల బిందువుల వర్ణ సమ్మేళనాన్ని ఇక్కడ మనం రక్త శుక్ల బిందువుల మేళనంగా భావించాలి. ఈ మిశ్రబిందువునే అహం అంటారు. ఈ నాసాభరణం సౌమంగళ్య సూచకం.

మరొక విధమైన అన్వయం ప్రకారం సంసారాత్ తారయతి ఇతి తారం. సంసారచక్రమునుండి తరింప జేయునది కాబట్టి తారం. తారం యొక్క భాసురత్వం అనగా వెలుగు జ్యోతిర్మయత్వం అన్నది తారాకాంతిగా ఇక్కడ చెప్పబడింది. అటువంటి వెలుగును త్రోసిరాజంటున్నది అమ్మ ముక్కెర అని సూచన. అనగా ముక్కెరకు శోభ అమ్మ ధరించటం వలన వచ్చినది. ఆవిడ స్వయంగా పరభ్రహ్మ స్వరూపిణి. ముక్కెరవెలుగులు సూచించే పరబ్రహ్మ స్వరూపానికే అలంబనమైనది అమ్మ కాబట్టి తారకమైన జ్యోతుల ద్వారా సూచితమైన వెలుగు యొక్క సాధారణత్వాన్ని దాటి అమ్మ యొక్క శోభ ప్రకాశిస్తున్నది. అమ్మ శోభలో ఆవిడ ముక్కెరశోభ ఒక భాగం.

తారః అనగా తరింపచేయునది. అంటే ఆమాటకు అర్థం ప్రణవం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ. తస్య వాచకః ప్రణవః అని కదా. అమ్మ యొక్క ఆకారశోభ ఆ ప్రణవశోభను మించి ఉన్నది. అలా చేయటానికి ఆవిడ నాసాభరణం ఒక నిమిత్తం.

శంకరభగవత్పాదులు సౌందర్యలహరీ స్తోత్రంలో

అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి
త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం
వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం
సంరుద్ధ్యా యత్తాసాం ,బహిరపి ,సముక్తా మణిధరః

అని అమ్మ నాసాదండాన్ని ప్రస్తుతించారు. అమ్మా నీ నాసాదండం మాకూ మా వాళ్ళకూ కోరికలు తీర్చుగాక. నీ నాసాదండంలో ముత్యాలున్నాయి. నీ ఎడమ నాసిక నుండి వచ్చే గాలి వలన కూడా ముక్కు అంచున ముక్తామణులను ధరించినట్లు ప్రకాశిస్తున్నావు అని అంటున్నా రందులో.

తంజావూరును పాలించిన విజయరాఘవ నాయకుడికి ఒక గొప్ప నియమం ఉండింది.  అమ్మవారికి నివేదన జరిగి, ఆపైన బ్రాహ్మణసమారాధనం జరిగిన తరువాత కాని ఆయన భోజనానికి లేచే వాడు కాదు.

ఇది ఇలా ఉండగా, భగవంతుడి పరీక్ష కారణంగానా అన్నట్లుగా ఒకవారం పాటు విపరీతమైన వానల కారణంగా వంటచెఱకుకు ఎంతో ఇబ్బంది కలిగింది. చివరకు ఒక నాటికి అన్నీ పచ్చికట్టెలై వంట కుదిరే సావకాశమే లేకపోయింది.

అప్పుడు ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్దావిడ, ఆ పచ్చి కట్టెలనే ఉపయోగించి నేర్పుగా వంట చేసింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. విజయరాఘవ నాయక మహారాజు గారి నియమం భగ్నం కాకుండా దైవమే రక్షించినట్లైనది.

ఇది జరిగిన మరునాడు శ్రీరంగంలో గొప్ప అలజడి రేగింది. శ్రీరంగనాయకీ దేవిగా ఉన్న అమ్మ ముక్కెర హఠాత్తుగా అదృశ్యం ఐనది. అర్చకులు కొయ్యబారిపోయారు. అందరూ రాజదండనకు భయడుతున్న ఆ సమయంలో అమ్మ ఒక పెద్దముత్తైదువ ముఖంగా తన ముక్కెర  ఎక్కడ ఉన్నదో సెలవిచ్చింది. అది తంజావూరు విజయరాఘవ నాయక మహారాజుగారి వంటశాలలో ఒక చోట బూడిద కుప్పలో పడి ఉన్నదీ అని.

ఈ వార్త తంజావూరికి చేరి మహారాజు గారు స్వయంగా వెదకి బూడిద కుప్పలో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న అమ్మ ముక్కెరను కనుకొని ఆనందాశ్చర్యపరవశు డైనా డట. ఆ ముక్కెరను అలంకరించిన పల్లకీలో ఉంచి స్వయంగా మోస్తూ దాన్ని శ్రీరంగం కొనిపోయి సమర్పించాడని ఐతిహ్యం.

కన్యాకుమారి అని ప్రసిధ్ధమైన క్షేత్రం ఒకటి ఉంది దక్షిణదేశంలో. ఆక్షేత్రంలో అమ్మ పార్వతీ దేవిగా కొలువై ఉంది. అక్కడ అమ్మ చేతిలో ఒక మణిమాలను ధరించి ఉంటుంది. ఆ అమ్మకు ఉన్న ముక్కెర చాలా విశేషమైన ఖ్యాతి కలది. అమ్మ ముక్కెర వెలుగులు సముద్రంలోనికి కూడా చక్కగా ప్రసరించేవట దేదీప్యమానంగా. ఆ వెలుగులకు అటు ఎదురుగా వచ్చే నావలను నడిపే వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపేవట. దానితో వాళ్ళ కళ్ళు చెదరటం కారణంగా వారి నౌకలు అడ్డదిడ్దంగా పోయి రేవులో తీరాన ఉన్న బండరాళ్ళకు ఢీకొట్టుకొని ముక్కలైపోయేవని చెప్పుకుంటారు. అందుకే సముద్రాభిముఖంగా ఉన్న అమ్మ అలయం ఉత్తరద్వారాన్ని మూసి ఉంచుతారట. ఆద్వారాన్ని కేవలం ఉత్సవసమయాల్లో మాత్రమే తెరుస్తారట. దీన్ని బట్టి అమ్మ ముక్కెర ప్రకాశం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవలసిందే కదా. 

29, ఏప్రిల్ 2019, సోమవారం

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా  7

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా అన్న నామం అమ్మ నాసికను గురించి. నాసిక అంటే తెలుసును కదా ముక్కు.

వశిన్యాదులు అమ్మ ముఖశోభను వర్ణిస్తున్నారు కదా.  ముక్కు అనేది ముఖం మధ్యలో ఉంటుందాయెను. దాని గొప్పను గురించి చెప్పకపోతే ఎలా మరి?

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా  అన్న నామంలో చంపకం అనే శబ్దం ఒకటి వచ్చింది. ఈ చంపకం అన్న సంస్కృతపదానికి అర్థం సంపంగి. అందుచేత చంపకపుష్పం అంటే సంపంగి పువ్వు. ఈ సంపంగి పువ్వు అలాంటిలాంటిది కాదుట అది నవం అంటే అప్పుడే వికసించినది. సంస్కృతంలో సంపెంగను గంధఫలి అని కూడా అంటారు.

మనకు నవనీతము అన్న మాట బాగానే తెలుసును. బాలకృష్ణుణ్ణి నవనీతచోరుడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం కదా.  నవనీతం అంటె ఏమిటీ అంటే మనవాళ్ళలో చాలామంది వెన్న అని చెబుతారు. కాని నిజానికి ఆమాటకు అర్థం అప్పుడే చల్లచిలికి తీసిన వెన్న అని అర్థం.

అలాగే ఇక్క నవచంపకపుష్పం అంటే అప్పుడే వికసించిన సంపెంగపూవు అని అర్థం. అంటే ఆ సంపెంగపూవు కొద్దిగా వికసించింది. ఇంకా వికాసం పొందుతూనే ఉంది. అటువంటిది.

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా  అన్న నామంలో నాసాదండం యొక్క ప్రశస్తిని గురించి చెబుతున్నారు. నాసిక అంటే ముక్కు కదా. మరి నాసాదండం అంటే - ముక్కుదూలం అన్న మాట.

మొన్నమొన్ననే ముఖచంద్రకళంకాభమృగనాభవిశేషకా అన్న నామం చదువుకున్నాం అక్కడ కళంకాభం అంటే కళంకం వంటిది అని చెప్పటానికి వాడినట్లే ఇక్కడ కూడా అభము అన్న శబ్దం వాడారు. నవచంపకపుష్పాభం అన్నప్పుడు.  అంటే అమ్మ ముక్కుదూలం అప్పుడే కొద్దిగా విరిసిన సంపెంగ పూవులాగా ఉంది అని చెప్పారన్న మాట.

ముక్కును సంపెంగపూవుతో పోల్చటం కవులకు పరిపాటే.  చాలా ప్రసిధ్ధికి ఎక్కిన ఈ పద్యం చూడండి.

నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్

ఈ పద్యం తెలుగు ప్రభంధకావ్యాల్లో పారిజాతాపహరణం అన్న నంది తిమ్మన్న గారు వ్రాసిన కావ్యం లోనిదని చాలా మంది పొరబడుతూ ఉంటారు. అంతే కాదు, ఈ పద్యం వల్లనే నంది తిమ్మన్న గారికి ముక్కు తిమ్మన్న అన్న పేరు వచ్చింది అని కూడా చెబుతూ ఉంటారు.

కాని ఇది రామరాజభూషణుడు అనే కవిగారి అద్భుతప్రబంధ కావ్యం వసుచరిత్ర లోనిది. ఐతే ఒక చాటు కథ ప్రకారం నంది తిమ్మన్న గారి దగ్గరనుండి నాలుగువేల వరహాలకు రామరాజభూషణుడు ఈ పద్యం కొనుక్కున్నాడట! పిచ్చికథ. ఇద్ధరి కాలాలూ వేరువేరు.

ఈ పద్యానికి సంస్కృత మూలం ఉంది. అది ప్రతాపరుద్రచక్రవర్తి ఆస్థానంలోని విద్యానాథుడు అనే కవి వ్రాసిన నలకీర్తికౌముది అన్న సంస్కృత కావ్యంలోని

భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా
కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్
తన్నాసికా భూ దనుభూతగంధా
పార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా

నిజానికి ముక్కును సంపెంగతో పోల్చటం ఇంకా కొన్ని శతాబ్దాలకు ముందే నన్నెచోడుడు చేసాడు చూడండి కుమారసంభవంలో

చం. జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్
నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం
బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా
కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్

పార్వతీ అమ్మవారి ముఖాన్ని చూచి పద్మం అని భ్రమించి చక్రవాకపక్షులూ తుమ్మెదలూ దగ్గరకు వస్తున్నాయట.  దగ్గరకు రాగానే వాటికి అమ్మ ముఖకాంతి వెన్నెలలాగానూ అమ్మ నాసిక చంపకపుష్పం లాగానూ కనిపించిందట, సరిసరి ఈ చక్రవాకాలకు వెన్నెల నచ్చదు. ఆ తుమ్మెదలకు సంపంగి అంటే కిట్టదు. పద్మమని చేరాలో మానాలో తేల్చుకోలేక గడబిడ పడుతున్నాయట అవి.  అన్నట్లు ఈ పద్యం చంపకమాల అన్న ఛందస్సులో ఉంది చూడండి!

చూసారా కవులు ఎంత గమ్మత్తుగా ముక్కును సంపెంగను చేసి పద్యాలను చెప్తున్నారో.

ఇదంతా ఎందుకు తడుముకున్నాం అంటే స్త్రీల నాసికను కవులు సంపెంగ పూవుతో పోల్చటం ప్రసిధ్ధం అని ఒకసారి చెప్పుకుందుకు మాత్రమే.

అమ్మ శ్రీదేవి చిదగ్నికుండంలో దేవతల అంశలను అన్నింటినీ అంగీకరిస్తూ ఆవిర్భవించింది. అప్పుడు ఆవిడ నాసికగా వెలసినది కుబేరాంశ.

మంత్రశాస్త్రపరంగా బహిర్మాతృకా న్యాసంలో ఋ ౠ అన్నవి ఎడమ కుడి నాసికలకు బీజాలు.

అజపా మంత్రం అని చెప్పబడే హంసమంత్రానికి సాధనోపకరణం నాసిక. అమ్మ నాసికకు గంధఫలి అనగా సంపెంగకు అది కూడా అప్పుడే కొంచెంగా వికసించిన సంపెంగపూవుతో సామ్యం. వాసనలను గ్రహించేది నాసిక. అజపాసాధనవలన సమస్త వాసనలనూ విలీనం చేసుకొనే సాధనోపకరణం నాసికను ఇక్కడ గంధఫలితో పోల్చటం సముచితం.

నవ అంటే ప్రణవ సూచకం. అజపాసాధనలో ఉఛ్వాసనిశ్వాసాలు సోహం అనే హంసమంత్రం. ఈ సంపెంగ పూవు రేకులు స హ అనే వర్ణాలు. ప్రణవనాదమే పరీమళం అని కొందరి అభిప్రాయం.


25, ఏప్రిల్ 2019, గురువారం

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా


వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా। 6

వశిన్యాదులకు అమ్మ ముఖారవిందాన్ని గురించి ఎన్ని విధాలుగా చెప్పినా తనివి తీరదు కదా.

ఇప్పుడు అమ్మ ముఖాన్ని లక్ష్మీపరీవాహం అంటున్నారు. పరీవాహం అన్నా పరివాహం అన్నా ఒకటే. ఆమాటుకు తెలుగు సమానార్థప్రతిబోధక మైన  మాట అలుగు అని. మనం ఇక్కడ జలప్రవాహం అని గ్రహిస్తే సరిపోతుంది. అదీ ఎటువంటి పరీవాహం? లక్ష్మీ శబ్దం చేత అమ్మ ముఖం యొక్క సౌందర్యశోభను చెబుతున్నారు.

అందుచేత వక్త్రలక్ష్మీపరీవాహం అంటే అమ్మ ముఖకాంతి అనే ఒక జలప్రవాహం అని అర్థం. ఐతే ముఖాన్ని ప్రవాహంతో పోల్చటం కొంచెం వింతగానే అనిపిస్తుంది.

సరే ఈ నామంలో ఉన్న ఇతర శబ్దా లనూ పరిశీలించాక ఇంకా ఏమి బోధపడుతుందో చూదాం.

ఈ వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా అన్న నామంలో మిగిలిన భాగం  చలన్మీనాభలోచనా అని.  ఇందులో చివరి భాగం మీనాభలోచనా అని.  సంబోధనగా చివర్న ఆ కారం ఉన్నది సరే. అదటుంచుదాం  ఆభము అంటే పోలిక కలిగిన అని అర్థం.  మీనాభము అంటే మీనము(ల)తో పోల్చదగిన అని అర్థం.  అందుచేత మీనాభలోచన అంటే చేపలతో పోల్చదగిన కళ్ళుకలది అని అమ్మవారిని ఇక్కడ వశిన్యాదులు సంబోధిస్తున్నారు.

మనకు చప్పున గుర్తుకు వస్తుంది కదా. అమ్మకు  మీనాక్షి అని ప్రసిధ్ధమైన పేరు ఉండనే ఉంది.  దక్షిణదేశంలో మథురానగరంలో మీనాక్షి అన్న పేరుతో అమ్మ కొలువై ఉంటుంది.

ఇంకా వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా అన్న నామంలో 'చలత్' అన్న మాటొకటి ఉంది. చలత్ + మీనాభలోచనా -> చలన్మీనాభలోచనా అని సంధి కార్యం.  ఈ చలత్ అన్న దానికి అర్థం చలిస్తూ ఉన్న అని. సులభంగానే ఉన్నది కదా.

చలన్మీనములు అంటే కదులాడుతూ ఉన్న చేపలు అని తాత్పర్యం.

మగవాడు అని చెప్పేందుకు ఆట్టే మాటలు కనిపించవు కాని స్త్రీ అని చెప్పటానికి మాత్రం భాషలో కొల్లలుకొల్లలుగా మాటలున్నాయి. తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా.

తరళేక్షణ, తరళాక్షి, లోలాక్షి, చంచలాక్షి అన్నమాటలు స్త్రీ అన్న మాటకు పర్యాయపదాలు. వీటి అన్నింటి భావమూ కదులుతున్న కళ్ళు కలది అనే. ఒకకవి ఐతే భీతహరిణేక్షణ అన్నాడు. అంటే అవిడ కళ్ళు బెదిరిన లేడి కళ్ళలాగా అటూ ఇటూ కదులుతున్నాయని అనటం.

పిండితార్థం ఏమిటంటే ఆడవాళ్ళ కళ్ళు రెపరెపలాడుతూ ఉంటాయి. అదొక అందం. అలా ఎందుకూ అంటే సహజంగా వారు తమ పరిసరాలు సురక్షితమేనా అన్న విషయంలో సహజంగా అత్యంత జాగరూకతతో ఉంటారు కాబట్టి అనుకోవాలి.

ఇప్పుడు మొత్తం నామం యొక్క అర్థం చూదాం. ముఖకాంతి అనే జలప్రవాహంలో చలిస్తూ ఉన్న చేపల వలె ఉన్న కన్నులు కల తల్లీ అని అమ్మను వశిన్యాదులు సంబోధిస్తున్నారు.

ఇక్కడ అమ్మను మీనాభలోచనా అని చెప్పి మీనాక్షీ స్వరూపాన్ని స్మరించటం జరిగింది. మీనాక్షి అమ్మవారు కరుణాసముద్ర. శంకరభగత్పాదులు మీనాక్ష్మీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్యవారాన్నిధిం అని అన్నారు. మీనాక్షి అమ్మవారు కరుణ అనే జలరాశి అని. ఇక్కడ వశిన్యాదులు అమ్మముఖం అనే లక్ష్మీప్రదమైన జలరాశి అన్నారు.

అమ్మ చిదగ్నికుండంలో ఉద్భవించినప్పుడు, అగ్నిదేవుడి తేజస్సు ఆవిడకు కన్నులుగా అమరింది. మంత్రశాస్త్రపరంగా కుడి, ఎడమ కనులకు ఇకారం, ఈకారం న్యాసాక్షరాలు.

సంప్రదాయంలో మీనముల గురించి ఒకమాట చెప్తారు. అన్యోన్యసంయోగం అవసరం లేకుండా పరస్పర వీక్షణం వలననే అవి సంతానాన్ని పొందుతాయని. వాటిని పోషించటం కూడా కేవలం వీక్షణం చేతనే అని.

వీక్షణం చేతనే సమస్తాన్నీ సంతానానికి అనుగ్రహించే శక్తి మీనజాతికి ఉందన్న సంగతిని పురస్కరించుకొనే అమ్మ కళ్ళు మీనాలనటం. అనగా అమ్మ కూడా కేవలం అనుగ్రహ వీక్షణం ద్వారానే తన సంతతి ఐన సమస్త జీవరాశినీ పోషిస్తున్నది అని సూచన.

24, ఏప్రిల్ 2019, బుధవారం

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా


వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా।  6

వెనుక 16వ నామంలో వశిన్యాదులు అమ్మ ముఖాన్ని పూర్ణచంద్రబింబంతో పోల్చి చెప్పారు. ఆ చంద్రబింబంలో మచ్చ వలె అమ్మ కస్తూరీతిలకం శోభిస్తోందీ అని.

ఈ 17వ నామం ఐన వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా అనే దానిలో మరొక విధంగా పోలుస్తున్నారు చూడండి.

వదనం అంటే తెలిసిందే కదా ముఖం అని అర్థం. మాంగళ్యగృహం అట అమ్మ ముఖం.  మంగళగృహం అనే మాటే పరమమనోహరంగా ఉంది కదూ. ఏ ఇంట సమస్త శుభాలూ నెలకొని ఉన్నాయో అది కదా మంగళగృహం అయ్యేది. అమ్మ ముఖమే సమస్త శుభాలకూ నిలయం అనటంలో సందేహం ఏమీ ఉండదు. అమ్మ స్ఫురణకు రాగానే ఆవిడ ప్రసన్నముఖారవిందం స్ఫురణకు వస్తుంది. ఆ కరుణాపూరితమైన ముఖాన్ని ధ్యానించే వారికి సమస్త మంగళాలూ నిత్యం కలుగుతూనే ఉంటాయి అనటంలో ఎంత మాత్రం మనకు సందేహం అక్కర లేదు కదా.

ఇక్కడ వశిన్యాదులు ఒక చిత్రమైన కల్పన చేస్తున్నారు. అమ్మ ముఖం మన్మథుడు అనే పెద్దమనిషి యొక్క మంగళగృహం అట. అందుకే దాన్ని వారు వదనస్మరమాంగళ్యగృహం అనగా మదనుడి యొక్క మంగళగృహం ఐన వదనం అంటున్నారు.

ఈ నామం చివర చిల్లికా అని ఒక శబ్దం ఉంది. చిల్లిక అంటే కనుబొమలతో ఏర్పడిన భ్రూలత. నామకల్పద్రుమం అనే గ్రంథంలో చిల్లికా అన్న శబ్దానికి  చిల్లికా భ్రూలతా యస్యాః అని చెప్పారు. లలితాస్తవరత్నం అనే దానిలో కూడా అభుగ్న మసృణ చిల్లి అని ప్రయోగం ఉంది.

ఈ చిల్లికా అన్నది ఎందుకు వచ్చిందయ్యా నామంలో అన్నది చూదాం. వదనస్మరమాంగళ్యగృహం అన్నది తెలుసుకున్నాం. అలా అమ్మ ముఖారవిందాన్ని మన్మథుడి యొక్క మంగళగృహంగా చెప్పటం జరిగింది.

ఈ నామం వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా  లో అంటూ ఆ గృహం యొక్క తోరణాల ప్రసక్తి చేసారు.  ఆ మంగళగృహం యొక్క తోరణాలు అమ్మ చిల్లిక అంటున్నారు.

అంటే అమ్మ ముఖారవిందమే మన్మథుడి యొక్క మంగళగృహం.
అమ్మ ముఖంలోని కనుబొమలు ఉన్నాయే అవి ఆ మంగళగృహానికి తోరణాల్లాగ ఉన్నాయి అని అంటున్నారు!

గృహతోరణాలు అంటే ఇంటి ముఖద్వారానికి కట్టిన మంగళతోరణాలు అన్న మాట.

అమ్మ ఆవిర్భవించిన వేళ, పూర్వ, అపర సంధ్యలే అమ్మ యొక్క కనుబొమలు అయ్యాయి.  పూర్వ సంధ్య అంటే ఉదయ సంధ్య, అపరసంధ్య అంటే సాయంసంధ్య.

ఇక్కడ ఒక మంత్ర శాస్త్ర విశేషం ఉంది. వదనం ఐం బీజం, స్మర అనగా మన్మథ బీజం క్లీం (దీనినే కామరాజబీజం అనీ అంటారు).  మాంగల్య సౌః అనే బీజం. గృహం శ్రీం, తోరణ హ్రీః  ఇవీ ఈ నామంలో నిక్షిప్తం ఐన బీజాక్షరాలు.

ఈ శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః అనే ఐదింటినీ పంచప్రణవాలు అని శ్రీవిద్యాసంప్రదాయంలో పేరు. వీటి విశేష లక్షణాలు

శ్రీం   వేడిమి
హ్రీం  తేజస్సు
క్లీం   ఆకర్షణ
ఐం   శబ్దం
సౌః   విద్యుత్తు

ఈ బీజాక్షరాలు అనులోమంగానూ, విలోమంగానూ గ్రహించబడి శ్రీషోడశాక్షరీకవచ కూటమిగా ఉన్నాయి.

కొన్ని పుస్తకాలలో ఈ నామం వదనస్మరమాంగళ్యగృహతోరణవల్లికా  అని ఉంది కాని అది సరికాదు. వల్లిక అంటే భ్రూలత అన్న అర్థం వీలుపడదు. కాబట్టి ఈపాఠం ఉచితం కాదు.

16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 5

వశిన్యాదులు చెప్పిన స్తోత్రంలోని యీ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో ఉన్న మృగం కస్తూరీ మృగం. మృగనాభం అంటే కస్తూరి.  కస్తూరి పరీమళం చాలా గొప్పగా ఉంటుంది.

అసలు సిసలైన పరిమళద్రవ్యాలంటే ఎనిమిదింటిని చెబుతారు. అవి  కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము అనేవి.

సంస్కృతంలో మృగం అన్న మాటకు సాధారణార్థంగా జంతువు అని అర్థం ఉన్నా, విశేషంగా మృగం అంటే జింక అనే అర్థం. స్త్రీని మృగనయన అంటారు అంటే అమ్మాయి కళ్ళు జింక కళ్ళ వలె అందంగా ఉంటాయని పోల్చి చెప్పటం. అంతే కాని ఏజంతువైనా మృగం అంటారు కాబట్టి గేదెకళ్ళు కలది విగ్రహవాక్యం చెప్పకూడదు!

అందుచేత కస్తూరిమృగం అంటే కస్తూరిజింక. జింకల్లో ఒక జాతి. వాటిలోనూ మగ కస్తూరిజింక పురుషాంగానికి కొంచెం పైన ఉన్న ఒక గ్రంథి నుండి వెలువడే ఒక పరిమళభరిత స్రావం.

ఈ కస్తూరి మీద వేమన్న పద్యం ఒకటి ఉంది.

మృగమదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ

ఈ మృగమదం అనబడే కస్తూరి పరిమళద్రవ్యాలలోని కెల్లా గొప్పది అన్నది నిర్వివాదం. ఈ రోజుల్లో మనం సంప్రదాయికమైన పరిమళద్రవ్యాల మీద అభిరుచిని కోల్పోయాం. ఏ కంపెనీ సెంటు బాగుంటుందా అనే అలోచన మనది. కాని అవన్నీ కూడా రకరకాల రసాయనాలు కాని సహజమైనవీ నిరపాయకరమైనవీ కానే కావు.

మన కస్తూరి అపాయకరమైనది కాదు కాని అచ్చమైన కస్తూరిని వాసన చూస్తే ముక్కు వెంట నెత్తురు వచ్చే అవకాశం ఉందట! అందుకని సహజమైన కస్తూరిని కూడా సాధారణంగా కొంచెం ఇతరపదార్థాలతో కలిపి కొంచెం సున్నితం చేసే వాడుతారట.

ఈ కాలంలో కస్తూరి పేరుతో చెలామణీ అవుతున్న దానిలో ముప్పాతిక మువ్వీసం నకిలీ. అసలు కస్తూరిమృగం నుండి వచ్చిన పరిమళద్రవ్యం కానే కాదు.

కస్తూరి ఒక పరిమళద్రవ్యం అనగానే అది ఒక అలంకారంగా వాడబడే వస్తువు అని వేరే చెప్పనక్కర లేదు కదా.

మరి అమ్మ కూడా కస్తూరిని ఒక అలంకారంగా నుదుట తిలంగా ధరిస్తుంది అని ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా అనే దాని వలన తెలుస్తోంది.

మరి అలా అమ్మ పెట్టుకున్న కస్తూరీ తిలకం గురించి ప్రస్తావించగానే మనకి ఈ ప్రసిధ్ధమైన శ్లోకం గుర్తుకు రావాలి కదా. ఒకసారి చెప్పుకుందాం.

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం
గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః

ఈ సుప్రసిధ్ధశ్లోకం లీలాశుకుడి శ్రీకృష్ణకర్ణామృతం లోనిది. ఇందులో శ్రీకృష్ణమూర్తి శోభను వర్ణిస్తున్నాడు కవి. ఆయన ముఖాన కస్తూరిని తిలకంగా ధరించి ఉన్నాడట.

దీనిని బట్టి ఒకప్పుడు స్త్రీలూ పురుషులూ కస్తూరీతిలకాలను ధరించే వారని అర్థం అవుతున్నది కదా. ఈ కస్తూరి కేవలం అలంకారసాధనమే కాదు, ఆయుర్వేదవైద్యంలో దీనికి చాలా ప్రశస్తి ఉంది. ఇది ధనధాన్యసౌభాగ్యవర్థకం అన్న ప్రతీతి కూడా ఉంది.

కస్తూరి అలంకారం కావటానికి కారణం అది సువాసనాభరితం కావటమే కాదు, ఆ సువాసన శృంగారోద్దీపనం కావటమూ ముఖ్య కారణమే.  ఈ శ్రీనాథుడి చాటువు చూడండి.

అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక శ్రేణికిన్
దక్షారామపురీవీహారవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించుతద్వాసనల్

అమ్మ కస్తూరీ తిలకం ధరించింది కదా, ఆ తిలకం ఎలా శోభిస్తోందీ అంటే వశిన్యాదులు ఒక చక్కని ఊహ చేసి చెప్పారు.

స్తీల ముఖాలను చంద్రబింబాలతో పోలుస్తాం కదా. అమ్మముఖం ఐతే చెప్పేది ఏముంది అచ్చంగా పూర్ణచంద్రబింబమే అనవలసిందేను.

చంద్రుడు ఎంత అందంగా ఉన్నా ఆ చంద్రబింబంలో ఒక మచ్చ ఉంది అని అందరికీ తెలుసు. కాని చిత్రం ఏమిటంటే మచ్చ ఉన్నా అది చంద్రుడి అందానికి ఏమన్నా లోపమా అంటే కానే కాదు. ఒక్క సినిమా చంద్రుడు మాత్రమే మచ్చ లేని చంద్రుడు కాని ఆకాశం మీద చంద్రుడు మచ్చతోనే ఉంటాడు - ఐనా చాలా అందంగా.

ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో కళంకం అనే శబ్దం ఉంది కదా. కళంకం అంటే మచ్చ. ఈ మాట అందరికీ తెలిసిందే.  ఇకపోతే ముఖచంద్ర అనే పోలిక ఉంది. అంటే ముఖం అనే (పూర్ణ)చంద్రబింబం. వశిన్యాదులు కళంకాభం అన్నారు కదా,  దాని అర్థం కళకం వంటిది అని.

ప్రశ్న. అమ్మ ధరించిన కస్తూరీతిలకం  ఎలా ఉందీ?
జవాబు. నల్లగా ఉంది.

ప్రశ్న. కొంచెం కవిత్త్వంతో చెప్తే ఆ నలుపు ఎలా ఉందీ అంటాం?
జవాబు.  అమ్మ ముఖం అనే పూర్ణచంద్రబింబంలో మచ్చలాగా ఉంది

చంద్రుడు మనః కారకుడు.  చంద్రమా మనసో జాతః అని వేదం. సమస్తజీవుల సమిష్టి మనో రూపమే చంద్రుడు.  అచంద్రుడు అమ్మకు ముఖం. అయన షోడశకళా యుక్తుడు.

22, ఏప్రిల్ 2019, సోమవారం

15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 5

అళికము అంటే నుదురు.

అమ్మ నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నదట.

నెలలో రెండు పక్షాలు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని. ఒక్కొక్క పక్షానికి పదిహేను తిథులు. వాటిని మనం వరుసగా వ్రాస్తే ఇలా ఉంటాయి.

శుక్లపక్షంలో
పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి
అష్టమి
నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి.

అలాగే కృష్ణపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి
అష్టమి
నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య

రెండుపక్షాల్లోనూ కూడా అష్టమి మధ్యన వస్తుంది. అటు ఏడు తిధులు, ఇటు ఏడు తిధులు.

కళాతు శోడశో భాగః అని నిర్వచనం ప్రకారం కళ అంటే పదహారవ వంతు.

మరి తిథులు పదిహేనే కదా అనవచ్చును మీరు.

పౌర్ణమి చంద్రుణ్ణి షోడశకళా ప్రపూర్ణుడు అంటారు. అంటే నిండా పదహారు కళలూ ఉన్నవాడు అని. పౌర్ణమి నుండి ఒక్కొక్క తిథినాడూ ఒక్కొక్క కళ తగ్గుతుంది. అమావాస్య నాటికి ఒక్క కళ మిగులు తుంది. లేకపోతే కళలన్నీ నశించటం అంటే చంద్రుడే లేక పోవటం కదా! అందుకని అమావాస్యకు సున్నా కాదు ఒక్క కళ అన్నమాట. ఆనాటి నుండి ప్రతి తిథికి ఒక్కొక్క్ కళ చొప్పున పెరిగి మరలా పౌర్ణమి నాటికి పదహారుకళలూ పూర్తిగా సంతరించుకుంటాడు చంద్రుడు.

ఈ కళలకు విడివిడిగా పేర్లూ ఉన్నాయి. వాటికి అధిష్ఠాన దేవతలూ ఉన్నారు!

ఈ కళాదేవతలకు నిత్యలు అని పేరు. ఈ షోడశ నిత్యల నామధేయాలూ  చూదాం.

  1. కామేశ్వరి
  2. భగమాలిని
  3. నిత్యక్లిన్న
  4. భేరుండ
  5. వహ్నివాసిని
  6. మహావజ్రేశ్వరి
  7. శివదూతి
  8. త్వరిత
  9. కులసుందరి
  10. నిత్య
  11. నీలపతాక
  12. విజయ
  13. సర్వమంగళ
  14. జ్వాలామాలిని
  15. చిత్ర
శుక్లపక్షంలో పాడ్యమి నుండి ఆరోహణ క్రమంలో కామేశ్వరి నుండి చిత్రవరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.
కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అవరోహణ క్రమంలో చిత్ర నుండి కామేశ్వరి వరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

రెండు పక్షాల్లోనూ కూడా అష్టమి నాటి నిత్యాదేవత పేరు త్వరిత.

పదహారు కళలూ అని చెప్పి నిత్యాదేవతలను పదిహేను మందినే చెప్పారేం అని మీరు ప్రశ్న వేయవచ్చును. పదహారవది ఐన కళ పేరు మహానిత్య. ఇది సర్వకాలమూ ఉండే కళ. ప్రత్యేకంగా అధిష్ఠాన దేవతను చెప్పలేదు.

అమ్మవారి నుదురు అష్టమి చంద్రుడిని పోలి ఉంది అని చెప్పారు కదా. ఇందులో విశేషం ఏమన్నా ఉందా అని అలోచిద్దాం.

వికాసదశ ఐన శుక్లపక్షంలోనూ క్షీణదశ ఐన కృష్ణపక్షంలోనూ కూడా అష్టమి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు. అధిష్ఠాత్రి త్వరితా నిత్య. 

సంతోషమూ వ్యసనమూ వలన బేధం లేని లలాటం అమ్మది అని అర్థం.  ఏవిధమైన పరిణామబేధమూ లేనిది అన్నమాట.

అమ్మ ముఖం పూర్ణచంద్ర బింబం.
అమ్మ లలాటం అర్థం చంద్రబింబం.

తిథులలో ప్రతి పగటికీ రాత్రికీ కూడా విడివిడిగా సంకేత నామాలున్నాయి.  శుక్లపక్షం అష్టమి రాత్రికి పేరు ఆప్యాయ.  అంటే శ్రీదేవీ అమ్మవారి లలాటం ఆప్యాయత కురిపించేదిగా ఉన్నదని భావం.

ఇక్కడ ఒక సమయమత రహస్యం ఉంది. అమ్మముఖం పూర్ణచంద్ర బింబం.  శరీరాంతర్గత పూర్ణచంద్రస్థానం సహస్రారం. అక్కడ సాధకుడికి అమృతసిధ్ధి.

అమ్మవారి లలాటం పైన అంతర్దృష్టి నిలిపి ధ్యానం చేస్తే అష్టమీ చంద్రదర్శనం. అంటే సగం దూరం అతిక్రమించి వచ్చేయటమే యోగంలో అన్నమాట.

త్వరితా త్వరితం ఫలదాయినీ అని శారదాతిలకం.

ఇది సులభోపాయం.  ఇదే రహస్యంం.

సామాన్యులకు ఐనా సరే అమ్మ ముఖదర్శనమే త్వరితఫలదాయక మని గ్రహించాలి. సమస్త కామితములూ అమ్మ ముఖాన్ని మానసికంగా ధ్యానంలో దర్శించితే చాలు అవి వెంటనే ఫలిస్తాయని ఆశీః పూర్వకమైన సందేశం.

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా


చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 4

ఈ కురివిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న నామంలో అమ్మవారి కోటీరం అంటే కిరీటం యొక్క శోభని వర్ణిస్తున్నారు వశిన్యాదులు.

కురువిందము అంటే పద్మరాగం. కురువిందమణి అంటే పద్మరాగమణి. శ్రేణి అంటే తెలిసిందేగా వరుస అని అర్థం. అందుచేత కురువిందమణిశ్రేణి అంటే పద్మరాగమణిపూసల వరుస.

కాబట్టి కురువిందమణిశ్రేణీకనత్ కోటిరము అంటే పద్మరాగమణుల వరుస(ల)తో ప్రకాశిస్తున్న కిరీటం అని తాత్పర్యం.

ఈ కురివిందమణిశ్రేణీకనత్కోటీరమండితా లో చివరన ఉన్న మండితా అన్న సంబోధన వలన అమ్మవారిని వశిన్యాదులు ద్మరాగమణుల వరుస(ల)తో ప్రకాశిస్తున్న కిరీటంతో  అలంకరించుకొని ఉన్న తల్లీ అని సంబోధిస్తున్నారని బోధపడుతున్నది.

కొంచెం శాఖాచంక్రమణం ఐనా మనం ఇప్పుడు ఈ పద్మరాగమణుల గురించి కొంచెం తెలుసుకుందాం.

రావణగంగ అని ఒక నది ఉంది.  వినటానికే కొంచెం చిత్రంగా ఉంది కదా?

రాజశేఖరుడు అనే పదవశతాబ్దానికి చెందిన ఒకాయన పుస్తకం కావ్యమీమాంసలో రావణగంగ గురించిన ప్రస్తావన వస్తుంది. ఈ రావణగంగ అనే నది శ్రీలంకలో ఉన్నట్లుగా ఆ పుస్తకం బట్టి తెలుస్తోంది.

గరుడపురాణంలోని రత్నాధ్యాయం ప్రకారం పద్మరాగమణులకు రావణగంగ పుట్టిల్లు.

తస్యా స్తటేషు చారురాగా భవంతి తోయేషు చ పద్మరాగాః
సౌగంధికోత్ఠాః కురివిందజాశ్చ మహాగుణాః స్ఫాటికసంప్రసూతాః

బంధూక గుంజా శకలేంద్రగోప
జపా శశ్యసృక్ సమవర్ణశోభాః
భ్రాజిష్ణవో దాడిమ బీజవర్ణా
స్తథాపరే కింశుక భాసః

ఈ పై పురాణశ్లోకాలను బట్టి రావణగంగా నదిలోనూ ఆ నదీతీరంలోనూ అందంగా ఎఱ్ఱగా ఉండే పద్మరాగమణులున్నాయి.

ఆ నదీజలాల్లో సౌగంధికములు, కురివిందములు, స్ఫటికములు అని మూడు రకాల శిలలున్నాయి. వాటి నుండి పద్మారాగాలు జన్మిస్తున్నాయి.

ఆ పద్మరాగమణులు కొన్ని బంధూకవర్ణం కలవి. అంటే మంకెన పూవు చాయవి. కొన్ని గుంజాశకలం అంటే గురివిందపూవు రంగు కలవి. కొన్నిఇంద్రగోపం అంటే ఆరుద్రపురుగు రంగులో ఉన్నవి.  కొన్ని జపాకుసుమం అంటే మందారపువ్వు రంగువి. కొన్ని శశి వర్ణం అంటే లొద్దుగపూవు రంగువి. కొన్నిఅసృక్ వర్ణం అనగా రక్తపు రంగు కలవి. కొన్ని  దాడిమ అనగా దానిమ్మగింజల వలె మరికొన్ని కింశుకము అనగా మోదుగపూవు రంగుకలవి. ఇలా అవి ఎఱుపుదనంలో వివిధమైన చాయలు కలవిగా ఉంటాయి.

ఆనదిలో పద్మారాగాలు కల మూడు రకాల శిలల్లో కురివిందముల నుండి జన్మించిన పద్మరాగాలు విశిష్టమైనవి. ఏమిటయ్యా ఆ విశిష్టత అంటే పురాణం ఇలా చెబుతోంది.

కామానురాగః కురువిందజేషు
శనై ర్న తాదృక్ స్ఫటికోద్భవేషు
మాంగల్య యుక్తా హరిభక్తిదాశ్చ
వృధ్ధిః ప్రదాస్తే స్మరణాద్భవంతి

కురువిందముల నుండి పుట్టిన మణులు కామానురాగ కారకాలు. మిగతావాటికి ఆ శక్తి లేదు.
స్ఫాటికశిలల నుండి పుట్టినవి మాంగల్యయుక్తములు. వీటిని స్మరించినంత మాత్రానే హరిభక్తి వృధ్ధి అవుతుంది.

ఇప్పుడు ఈ కురువిందమణి అన్న మాటను పట్టుకొని ఆరాతీస్తే మనకి అవగతం అయ్యేది ఏమిటంటే అవి శుభాన్ని కలిగించేవీ హరిభక్తిని పెంపొందించేవీ అని.

శ్రీహరిని స్మరిస్తూ శంకరభగవత్పాదులు సౌందర్యలహరీ స్తోత్రంలో ఒక మాట అంటారు.

హరిస్త్వా మారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం
పురానారీభూత్వా పురరిపు మపి క్షోభమనయత్
స్మరో పిత్వాం నత్వా రాతినయన లేహ్యేన వపుషా
మునీనా మత్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్

ఆ హరి అమ్మను ఆరాధించి అడవేషం ధరించి శివుణ్ణే మోహింప చేయ గలిగాడని పై శ్లోకంలో ప్రశంస. అంతే కాదు మన్మథుడు కూడా అమ్మని ఆరాధించే మునీశ్వరుల్ని సహితం మోహపరవశుల్ని చేయగల శక్తిని ఆర్జించుకున్నాడట.

ఇప్పుడే చెప్పుకున్నాం కదా కురువిందముల నుండి పుట్టిన మణులు కామానురాగ కారకాలు అనీ.  అమ్మవారి కిరీటంలో అలంకరించి ఉన్న కురువిందమణుల మాలలే అమ్మ భక్తులకు కామానురాగసిధ్ధి ప్రదాయకాలు అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. హరి అయ్యేది ఆయన కుమారుడు మన్మథుడు అయ్యేది అమ్మని ఆరాధించి ఆవిడ కిరీట స్మరణ దర్శనాదులవలననే కామానురాగాలకు సంబంధించిన నిగ్రహానుగ్రహాది శక్తులను సంపాదించుకొన్నారన్న మాట.

అమ్మవారి కిరీటంలో ఉన్న స్ఫాటికశిలాజన్యములైన మణులవలన హరిభక్తి అని కదా. అమ్మకూ హరికీ అబేధమే అని చెప్పుకోవాలి. అంటే అమ్మ కిరీటాన్ని స్మరించినా దర్శించినా భక్తివర్ధనం జరిగి అది మోక్షదాయకం అవుతున్నది.

కిరీటం అన్నది అధికార చిహ్నం. అమ్మ సకలజగాలకూ అధినేత్రి కదా.

4, ఏప్రిల్ 2019, గురువారం

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా



చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 4

ఇక్కడి నుండి కొన్ని నామాలు అమ్మవారి స్వరూపవర్ణనం చేస్తాయి.

ఈ నామం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా అన్నదానిలో చంపకము, ఆశోకము, పున్నాగము సౌగంధికము అనే పుష్పాలతో అమ్మ యొక్క శిరోజములు ప్రకాశిస్తున్నాయని చెప్తున్నారు వశిన్యాదులు.  ఈ పుష్పాలకు తెలుగుపేర్లు చూదాం. చంపకం అంటే సంపంగిపువ్వు. ఆశోకం అంటే పొగడపువ్వు. పున్నాగం అన్నది తెలుగులో కూడా వాడుకలో ఉన్నదే - ఇవి సురపొన్న లేదా పొన్న పూవులు. సౌగంధికాలు అంటే చెంగల్వపూలు.  ఇవన్నీ అమ్మ తలకట్టులో ఉండి ఆతలకట్టు చాలా శోభాయమానంగా ఉందని చెప్తున్నారు.

మనం ఇప్పటికే గడచిన నామాల్లో అమ్మ అగ్నికుండము నుండి ఉద్భవించింది అని చెప్పుకున్నాం. మరి అలా అగ్నిగుండం నుండి పైకి వస్తున్నప్పుడు మనకు మొదట దర్శనం ఇచ్చేది అమ్మ తలకట్టే కదా. అందుకని మొదట తలకట్టును వర్ణిస్తున్నారన్నమాట. సాధారణంగా ఐతే పాదాలతో వర్ణన మొదలుపెట్టాలి దేవలతలకు. ఇక్కడి సందర్భం ప్రత్యేకంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు అమ్మ తలకట్టును గురించి చెప్పారు.

ఇక్కడ ఈ నామంలో చంపకాశోకపున్నాగసౌగంధిక అని అన్నీ ఆయా చెట్లూ మొక్కల గురించి చెప్పారు కాని పూవులని చెప్పలేదే అని కొందరికి శంక రావచ్చును. అయ్యా ఇక్కడి సందరర్భాన్ని బట్టి మనం చెట్లూ చేమల గురించి గ్రహించాలా వాటి పూవులను గురించి గ్రహించాలా అర్థంలో అని ఆలోచించాలి. మామిడి అని అంటే అది మామిడి చెట్టు అని అర్థమా మామిడి కాయోపండో అని అర్థమా అంటే ఆ మామిడి అన్నమాట ఉన్న వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి అంటాం కదా. మీదేం తోట అంటే మామిడి అన్నారనుకోండి - అక్కడ అన్నీ మామిడి చెట్లు అని అర్థం చేసుకుంటాం. ఏం పళ్ళు తెచ్చావు అంటే మామిడి అన్నాడనుకోండి - అప్పుడు మామిడి పళ్ళు అని తెలుసుకుంటాం. జుట్టూ సుగంధమూ అని చెప్తున్నప్పుడు ఆ పూలజాతికి చెందిన వృక్షాలను గ్రహిస్తామా వాటి పూలను గ్రహిస్తామా? పూలనే కదా.

మరొక శంక ఉంది! ఈ పూలవలన అమ్మవారి జుట్టుకు శోభ వచ్చింది అంటే ఆ శోభ ఆ జుట్టుకు అబ్బిన సుగంధం గురించే కదా, అని. అవును ఇక్కడ ఆ పూలవలన కలిగిన సుగంధశోభ అనే అర్థం.

ఒక చక్కని కథ ఉంది. నక్కీరుడు అని ఒక కవిగారు. ఈయన కథ గురించి ధూర్జటి కవి గారి శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే కావ్యంలో ఉంది.

ఈ నక్కీరుడు దొడ్ద కవి. రాజుగారి సభలో ముఖ్యకవి కూడా . ఒక బీదబ్రాహ్మణుడు సభకు వచ్చి ఒక పద్యం చదువుతాడు. ఆయన ఆశ అల్లా, ఈపద్యం విని రాజు గారు ఏదన్నా నాలుగుకాసులు బహుమానం చేస్తాడు కదా అని. తీరా చదివాడా, ఆ పద్యం తప్పు పో అని నక్కీరుడు తిరస్కరించి మోకాలడ్డు వేసాడు.

నిజానికి ఆ పద్యం ఆ బీదబ్రాహ్మడి సొంతకవిత్వం కాదు. ఆయన దీనావస్థకు జాలిపడి శివుడే ఒక బ్రాహ్మణవేషంలో వచ్చి ఈపద్య ఇచ్చి రాజుగారికి వినిపించి బహుమానం పొందవయ్యా అని పంపాడు.

గోడక్కొట్టిన బంతిలాగా ఈబీదబ్రాహ్మడు వెనక్కు వచ్చి జరిగిన పరాభవం గురించి చెప్పి ఏడిస్తే,  ఈ మాయాబ్రాహ్మడు ఉగ్రుడై తానే బీదాయనతో సహా సభకు వచ్చి ఎవడ్రా పద్యం తప్పన్నదీ అని వాదం వేసుకున్నాడు.

ఏం పద్యమయ్యా ఎక్కడన్నా ఆడవాళ్ళ తలకట్లు సువాసన్లు వస్తాయా అని నక్కీరుడు వెక్కిరించాడు.

పార్వతీదేవి తలకట్టు సువాసన వస్తుందయ్యా, నా పద్యం సరైనదే అని శివుడు సిధ్ధాంతం చేసాడు.

అప్పుడు నక్కీరుడు ఒప్పుకున్నాడా? పార్వతీదేవి సంగతి అలా ఉంచు లోకంలో లేదే. ఐనా నీకేం తెలుసూ అంటాడు. దాంతో శివుడు నిజస్వరూపం చూపిస్తాడు. నక్కీరుడు మాత్ర్రం తప్పుతప్పే పోవయ్యా అని ఎలా అంటాడో చూడండి

కం. తలచుట్టువార కన్నులు
కలిగిన పద్యంబు తప్పు గాదన వశమే
వలదిచ్చట నీమాయా
విలసనములు పనికిరావు విడువు మటన్నన్

ఏమయ్యోయ్ నీకు మూడుకళ్ళున్నా పద్యం తప్పేను. మూడేమిటి తలచుట్టూ కళ్ళున్నా సరే, నీ పద్యం తప్పంటే తప్పే పోవోయ్, ఇంక వదిలేయ్! అన్నాడు

దాంతో శివుడికి మండి శపించాడు. ఆ శాపమూ దానికి శివుడు చెప్పిన విమోచనమూ నక్కీరుడికి శాపవిమోచనం ఐన తీరూ అంతా ఇప్పుడు మనం చెప్పుకోనవసరం లేదు. ఇంతవరకు చాలు.

సిధ్ధాంతం ఏమిటంటే అమ్మవారి జుత్తుకు సుగంధం అంటే పరీమళం సహజం. అది ఏపూవులవల్లనో తైలాదులవల్లనో వచ్చింది కాదు అని.

మరి ఇక్కడ చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా అంటున్నారే వశిన్యాదులూ అంటే దానికి ఒక చమత్కారమైన సమర్థన చెప్పుకోవాలి.

చంపక, అశోక, పున్నాగ పుష్పములవలె గొప్ప సుగంధము కల జుత్తు కలది అని నామానికి అర్థం చెప్పుకోవాలి.
అమ్మవారికి ఈసృష్టిలోని ఏవో పూవుల వలన సుగంధం రావటం అని చెప్పటం ఉచితం కాదు కదా అని భావించాలి.
ఇది బాగుంది కదా.

అసలు ఈ నామం ప్రకారం అమ్మవారి తలకట్టులోని సుగంధమే ఆపూవులకు అబ్బి అవే మంచి సుగంధాన్ని పొందుతున్నాయని డబాయించి చెప్పుకోవచ్చును.

శ్రీ లలితాత్రిశతి అని మరొక దివ్యగ్రంథం ఉంది. అందులో అమ్మవారి మూడువందల నామాలు చెప్పబడ్డాయి. ఈ లలితాత్రిశతికి శంకరభగవత్పాదులు భాష్యం వ్రాసారు. ఆనామాల్లో 'ఏలాసుగంధచికురా' అని ఒక నామం ఉంది. ఆ నామానికి శంకరభాష్యం కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా అమ్మ యొక్క కుంతలాలకు ఉన్న సహజసుగంధాన్ని పురస్కరించుకొని చెప్పుతున్నది.

భగవంతుడి విరాట్ స్వరూపం గురించి చెప్పేటప్పుడు వనస్పతులు శిరోజాలు అని చెప్పటం జరుగుతుంది. ఆ వనస్పతులు శ్రీదేవీ దివ్యకచం యొక్క సుగంధాన్ని ప్రదర్శిస్తున్నాయని భావించటం ఆహ్లదకరంగా ఉంటుంది. ఈసృష్టి యంతా పరబ్రహ్మస్వరూపంలో భాగమే కదా.

మల్లినాధ సూరి గారు. ఈయన పేరు విన్నారా?  కాళిదాసు కవిత్వం తెలియాలంటే మల్లినాధసూరి వ్యాఖ్యానం దగ్గర ఉండాల్సిందే. ఆయన రఘవంశం అనే కాళిదాసు కృతికి వ్యాఖ్యానం వ్రాస్తూ చెప్పిన మంగళాచరణ శ్లోకం

అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతమ్
దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజమ్

గౌరీదేవి దర్శనానికి దేవతాస్త్రీలు వచ్చారట. వాళ్ళ కొప్పుల్లో కల్పవృక్షం పూలున్నాయి. ఆ పూల సుగంధం వల్ల వాటిచుట్టూ తిరుగుతున్న తుమ్మదలూ ఉన్నాయి. సరే వీళ్ళు వచ్చి అమ్మ పాదాలకు నమస్కరించారు.

నమస్కరించారా? అప్పుడు ఆ తుమ్మెదలన్నీ ఆ స్త్రీల కొప్పులలోని పూలను వదలి అమ్మ పాదాల చుట్టూ తిరగటం మొదలు పెట్టాయట.

ఎందుకూ అంటే పూలసువాసనలు ప్రకృతి సహజమైనవి. అమ్మ పాదాల సుగంధం అప్రాకృతిక మైనది. ఆ దివ్యసుగంధం ముందు పూలవాసన లెంతనీ? అందుకే అవి పూలను వదలి అమ్మపాదాలను ఆశ్రయించాయి వెంటనే.

ఇదీ పై శ్లోకం తాత్పర్యం.

అంటే ఏమన్న మాట? అమ్మవారి శరీరం అంతా సహజంగానే దివ్యమైన సుగంధం కలది. ఆపాదమస్తకమూ అలా ఉంటుంది.

అందుచేత పరీమళం అంతా అమ్మ కొప్పుది.

ఆ పరీమళంతో అమ్మ కొప్పులోని చంపకాలూ అశోకాలూ పున్నాగలూ సౌగంధికాలూ గొప్పదనాన్ని పొందుతున్నాయి. అవీ సుగంధాలు చిమ్ముతున్నాయి అని అర్థం.



20, మార్చి 2019, బుధవారం

13 - 51. అమ్మ స్వరూప వర్ణనం.


శ్రీ లలితా సహస్రనామస్తోత్రంలో13వ నామమైన చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా నుండి 51వ నామమైన సర్వాభరణభూషితా వరకూ అమ్మ యొక్క భౌతిక స్వరూపవర్ణన ఉంది. ఈ నామాలు 4వ శ్లోకం నుండి మొదలై 21వ శ్లోకం ప్రథమార్థం వరకూ విస్తరించి యున్నాయి.

సవివరంగా నామాలను గురించిన చర్చకు ముందుగా ఒక సారి వాటి అర్థాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
సంపంగి పూవులు, అశోకపుష్పాలు, సురపొన్న పూవుల సువాసనచే ప్రకాశిస్తున్న జుట్టు అమ్మది.

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా
పద్మరాగ మణులవరుసలతో ప్రకాశిస్తున్న కిరీటం అమ్మది.

15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా
అమ్మ నుదురు అష్టమి చంద్రుని వలె ఉన్నది.

16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా
అమ్మ ముఖం అనే చంద్రబింబానికి కస్తూరీతిలకం అనేది ఒక చక్కని మచ్చలాగా శోభిస్తున్నది.

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
అమ్మ ముఖమే మన్మథుని మంగళ గృహం. ఆవిడ కనుబొమలు ఆ ఇంటి ముఖద్వారాలవలె ఉన్నాయి.

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా
అమ్మ ముఖకాంతి ఒక కారుణ్య జలప్రవాహం. ఆవిడ కన్నులు అ ప్రవాహంలో అందంగా కదలాడుతున్న చేపలు.

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
అమ్మ ముక్కుదూలం అప్పుడే వికసించిన సంపంగి పూవులా ఉన్నది.

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా
అమ్మ ముక్కుకు ఉన్న అడ్డబాస ప్రకాశం అకాశంపైన ఉండే నక్షత్రాల కాంతుల్ని త్రోసిరాజంటోంది.

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
అమ్మ చెవులపై మహామనోహరమైన అలంకంగారాలుగా కడిమిపూవుల గుత్తులు అలరారుతున్నాయి.

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా
సూర్యచంద్రులంటే వా ళ్ళెవ రనుకుంటున్నారు? వాళ్ళు అమ్మ చెవి కమ్మలే.

23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
ఎర్రని పద్మరాగాలు అందంగా ఉంటాయి. కాని అమ్మ ఎర్రని చెక్కిళ్ళ అద్దాలు పద్మరాగాల అందాల్ని త్రోసిపుచ్చుతున్నాయి.

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా
కొత్త పగడాల ఎరుపుదనం ఎంత గొప్పగా ఉన్నా అది అమ్మ పెదవుల అరుణిమ ముందు దిగదుడుపే.

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
శుధ్ధవిద్య అనే మొలక యొక్క రెండు చిగురుల్లాగా అమ్మ పండ్లవరుస ప్రకాశిస్తోంది.

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా
అమ్మకు కర్పూర తాంబూలం సేవించటం ఇష్టం. ఆవిడ తాంబూలపు ఘుమఘుమలతో దిక్కులు నిండిపోతున్నాయి.

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
అమ్మ పలుకులు ఎంతో మధురమైనవి. అవి సరస్వతీ దేవి వీణకంటే ఎంతో స్పష్టమూ మధురమూ ఐనవి.

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా
అమ్మ ఒలికిస్తున్న చిరునవ్వుల మధురకాంతుల్లో పరమేశ్వరుడి మనస్సు మునకలు వేస్తున్నది.

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా
ఎందరో ఎన్నో ఉపమానాలతో అమ్మ అలౌకికసౌందర్యాన్ని వర్ణించవచ్చును. కాని ఆవిడ గడ్డం ఎంత అందంగా ఉందో పోల్చి చెప్పేందుకు అటువంటిది ఇంచుమించుగా కూడా మరిక వస్తువు లేనేలేదే!

30. కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా
అమ్మ మెడలో కామేశ్వరుడు కట్టినది లోకోజ్జీవన కారణమైన పరమసౌభాగ్యచిహ్నమైన మంగళసూత్రం శోభాయమానంగా ఉంది.

31. కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా
కాది హాది విద్యాస్వరూపములైన బంగారు భుజకీర్తులను ధరించి అమ్మ విరాజిల్లుతున్నది.

32. రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా
అమ్మ మెడలో రత్నాలతో చేసిన  చింతాకు పతకాలున్నాయి, మంచిముత్యాల హారాలున్నాయి.

33. కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ
కామేశ్వరుని ప్రేమరత్నానికి సరైన వెలగా నిలస్తూ ఉన్నాయి అమ్మ స్తనాలనే మణుల జంట.

34. నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ
అమ్మ నాభినుండి పైకెదిగిన నూగారు అనే లతకు కాచిన రెండు మంచి ఫలాలుగా అమ్మ స్తనాలు శోభిస్తున్నాయి.

35. లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా
అమ్మ సన్ననిది. ఆవిడకు నడుము ఉందా లేదా అన్నది సంశయం ఐతే, దానికి పరిష్కరంగా అమ్మ నూగారు అమ్మకు నడుము ఉన్నది అని నిర్థారిస్తోంది.  అధారం లేనిదే నూగారు అనే లత ఎలా పైకి ప్రాకి స్తనాలనే పండ్లను కాచినది మరి?

36. స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా
అమ్మ స్తనముల భారము వలన అసలే సన్ననిదైన అమ్మ నడుము ఇబ్బంది పడుతున్నది. ఆ నడుమును నిలిపి ఉంఛటానికి కట్టిన బంగారు పట్టీలలాగా అమ్మకు పొట్టమీద మూడు ముడుతలు కనిపిస్తున్నాయి.

37. అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ
అమ్మ కటిప్రదేశంలో మిక్కిలి ఎర్రనైన వస్తాలు ధరించి ఉన్నది.

38. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా
అమ్మ బంగారపు ఒడ్డాణాన్ని ధరించింది. దానికి రత్నాలతో అలంకరించిన చిరుగంటలున్నాయి. అవి కిణికిణి అని మనోహరమైన ధ్వని చేస్తున్నాయి.

39. కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
అమ్మ కామేశ్వరి. అయ్యవారు కామేశ్వరుడు. ఈ ఇద్దరూ ఆదిదంపతులు. ఆవిడ ఊరువుల సౌభాగ్యమును కేవలము కమేశ్వరుడే యెరుగును.

40. మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా
అమ్మ మోకాళ్ళు అందమైన చిన్న మాణిక్యపు కిరీటాల వలె ఉన్నాయి.

41. ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా
మన్మథుని తూణీరాలను ఎర్రని ఆరుద్రపురుగులు ఆవరించుకొని ఉన్నయా అన్నట్లుగా అమ్మ  పిక్కలు శోభిస్తున్నాయి.

42. గూఢగుల్ఫా
చక్కగా పుష్టిగా ఉన్న చీలమండలు కలది అమ్మ.

43. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా
అమ్మ మీగాళ్ళు (అనగా పాదాలపైభాగాలు) అందమైన తాబేళ్ల వీపులను తిరస్కరించుతూ ఉన్నాయి.

44. నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా
అమ్మ తన కాలిగోళ్ళ ప్రకాశం చేతనే, పాదనమస్కారం చేసే జనుల తమోగుణాన్ని పోగొట్టుతున్నది.

45. పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా
కొలనుల్లోనూ పద్మాలున్నాయి.  అమ్మ పాదపద్మాల సౌందర్యప్రభలకు అవి ఎంతమాత్రం సాటిరావు.

46. శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా
అమ్మ పాదాలకు మణులు పొదగిన అందమైన అందెలున్నాయి.

47. మరాళీమందగమనా
అమ్మ నడక అందమైన హంసనడక వంటిది.

48. మహాలావణ్యశేవధిః
లావణ్యం అంటే సౌందర్య. అమ్మ సౌందర్యం వంటిది మరొకటి బ్రహ్మాండంలోనే లేదు.

49. సర్వారుణా
అమ్మ అంతా ఎరుపు మయం. ఆవిడ శరీరఛ్ఛాయయే కాదు. ఆవిడ ధరించే వస్త్రమాల్యాభరణాదులు అన్నీ కూడా ఎర్రనివే.

50. అనవద్యాంగీ
అమ్మ శరీరనిర్మాణం ఎక్కడా లోపం ఎన్నటానికి వీలులేనిది. సర్వశుభలక్షణములూ కలిగినది.

51. సర్వాభరణభూషితా
అమ్మ చూడామణి మొదలుకొని పాదాలకు ఉంగరాలవరకూ సర్వాంగముల యందూ సర్వవిధములా శ్రేష్ఠములైన ఆభరణాలు ధరించి ఉంది.

ఇదీ అమ్మ యొక్క స్వరూప వర్ణన.

ఇప్పుడు మనం ఈ స్వరూపవర్ణనాపర మైన నామాల గురించి విడివిడిగా చర్చించుకుందాం.

19, మార్చి 2019, మంగళవారం

12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా


మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా।
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా। 3

అరుణ వర్ణం అంటే ఎరుపు రంగు. ప్రభ అంటే కాంతి. ప్రభలు అంటే కాంతిపుంజాలు. అంటే కిరణాలు అనవచ్చును. ఆ పూరము అంటే చూదాం. పూరణము అంటే నింపట. ఆపూరణము అంటే బాగా నింపట. పూరము అంటే నిండినది. ఆపూరము అంటే బాగా నిండినది లేదా సంపూర్ణంగా నిండినది. ఇక నిజ+ అరుణప్రభ -> నిజారుణప్రభ అని సంధి కార్యం. ఇక్కడ నిజ అంటే తనయొక్క అని అర్థం. కాబట్టి నిజ + అరుణ + ప్రభ + ఆపూర -> నిజారుణప్రభాపూర అంటే తనయొక్క ఎర్రని కాంతితో సంపూర్ణంగా నిండిపోయిన అని భావం.

అలా సంపూర్ణంగా నిండటం వలన ఏమి జరిగిందీ అంటే మజ్జద్బ్రహ్మాండమండలా అంటున్నారు. మజ్జనం అంటే స్నానం. బ్రహ్మాండమండలం అంటే బ్రహ్మాండాల సమూహం అని అర్థం. బ్రహ్మాండాల సమూహం అని ఎందుకంటాం అంటే అమ్మ అనేకకోటి బ్రహ్మాండ నాయకి కదా అందు వలన.

మజ్జత్ + బ్రహ్మాండమండలా -> మజ్జద్బ్రహ్మాండమండలా అని సంధికార్యం. అంటే బ్రహ్మాండమండలాలన్నీ స్నానం చేసినటుగా ఉంటున్నాయన్న భావన. అంటే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి అని తాత్పర్యం

ఇప్పుడు మొత్తం నామానికి అర్థం చెప్పవలసి వస్తే అది, అమ్మ యొక్క అద్భుతమైన అరుణకాంతి (పుంజముల)తో పూర్తిగా (దిక్కులన్నీ) నిండిపోయి బ్రహ్మాండమండలాలన్నీ ఆ కాంతిలో సంపూర్ణంగా మునిగి స్నానం ఆచరిస్తున్నాయి అని.

అమ్మ అగ్ని యొక్క (అరుణ) వర్ణం కలది అని శ్రుతి (అంటే వేదం).

తా మగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అని తై-య-నారా-2-అనువాకం.

అలాగే శ్రీ జైమిని మహర్షికృత దేవీ వేదపాదస్తోత్రంలో

శ్రీచ్రకస్థాం శాశ్వతైశ్వర్యదాత్రీం
పౌణ్డ్రం చాపం పుష్ప బాణాన్‌ దధానామ్‌
బన్థూకాభాం భావయామి త్రినేత్రాం
తా మగ్నివర్ణాం తపసా జ్వలన్తీమ్

అని వర్ణన. దీని అర్థం శ్రీచక్రంలో ఉన్నదీ, స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేదీ, నామాలచెఱకువిల్లు కలదీ, పుష్పబాణాలు కలదీ, మూడు నేత్రాలతో మంకెనపూవు లాంటి శరీరఛ్ఛాయతో అగ్నివంటి ప్రభలు కలిగిన తపస్విని ఐన దేవిని భావన చేస్తున్నాను అని .

అమ్మవారి ధ్యానశ్లోకంలో కూడా అరుణాం కరుణాంతరంగితాక్షీమ్ అని వస్తుంది కదా.

అరుణాం కరుణాంతరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్‌
అణిమాదిభి రావృతాం మయూఖై:
అహ మిత్యేవ విభావయే భవానీమ

ఇక్కడ అమ్మవారిని అరుణా అంటే ఎర్రగా ప్రకాసిస్తున్న తల్లీ అని సంబోధించారు కదా.|

ఈ సందర్భంలో అంటే అమ్మవారి ఆవిర్భావఘట్టంలోని నామాల అమరికను గమనించండి.

ఉద్యద్భానుసహస్రాభా
చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా
క్రోధాకారాంకుశోజ్జ్వలా
మనోరూపేక్షుకోదండా
పంచతన్మాత్రసాయకా
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా

ఉద్యద్భానుసహస్రాభా అన్న నామంలో అమ్మ ఉదయిస్తున్న వేయి సూర్యుల యొక్క ప్రకాశంతో సమానమైన శోభతో -లేదా- ఉదయసూర్యుని సహస్ర(అనంత) కిరణసముదాయం యొక్క శోభతో అవతరించింది అని చెప్పి, అటు పిమ్మట ఆవిడకు నాలుగు చేతులున్నాయనీ ఆ బాహువుల్లో ఫలాని ఆయుధాలున్నాయనీ చెప్పారు. వెంటనే అమ్మ యొక్క అరుణ (ఉదయసూర్య) ప్రకాశంలో బ్రహ్మాండమండలాలన్నీ మునిగి స్నానం చేస్తున్నాయని చెబుతున్నారు వశిన్యాది దేవతలు.

అమ్మ ఆవిర్భావం యొక్క తేజస్సు సహస్రకిరణసదృశంగా మొదట యజ్ఞవాటికలోని దేవతా సమూహానికి తెలియవచ్చింది కదా. అటుపిమ్మట అమ్మ మూర్తి చతుర్భాహువులతో వెల్లడి కాగానే, అమ్మ యొక్క అరుణమైన తేజస్సు యజ్ఞవాటిని దాటి బ్రహ్మాండాన్నే కాదు, సమస్తమైన బ్రహ్మాండాలనూ ఆవరించి ముంచెత్తిందని చెబుతున్నారు.

అరుణ వర్ణం చైతన్యానికి సూచకం. ఉదయించే సూర్యుడు సమస్తజగత్తుకూ చైతన్యం ప్రసాదిస్తూ అంతవరకూ నిద్రావస్థలో పడి ఉన్న లోకాన్ని మేలుకొల్పుతాడు. ఆయన రాకతో వెల్లడయ్యే అరుణమైన తేజస్సు జగత్తుని ఉత్సాహపరుస్తుంది.

అమ్మ ఆవిర్భావం కూడా జగత్తును కాదు కాదు సమస్ర బ్రహ్మాండాన్నీ ఉత్సాహపరచేది.

ఇంతవరకూ భండాసురుడి యొక్క మాయాప్రభావం వలన ఒక్క బ్రహ్మాండం మొత్తం నిస్సత్తువ చెంది చైతన్యవిహీనం ఐపోయింది.

ఇప్పుడు అమ్మ రాకతో చైతన్యం ఒక వెల్లువలా బ్రహ్మాండాన్ని ముంచెత్తింది. అది ఈ బ్రహ్మాండాన్నే కాదు సమస్త బ్రహ్మాండాలనూ మహాచైతన్యంతో నింపేసింది అని తాత్పర్యం

స్వతంత్ర తంత్రంలో

స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహా
లౌహిత్యం తద్విమర్శ స్యా దుపాస్తిరితి భావనాః

అని ఉంది. ఇక్కడ అమ్మ యొక్క లౌహిత్యం అనగా అరుణిమను ప్రస్తావిస్తున్నారు. లోహితం అంటే రక్తచందనం అనీ రక్తం అనీ ఎరుపురంగు అనీ అర్థం. లౌహిత్యం అంటే లోహితము (ఎరుపు)గా ఉండటం అనే గుణం అనగా ఎర్రదనం.

అసౌ య స్తామ్రో అరుణ అని శ్రుతి. కుండలినీ రూప త్రిపురసుందర్యాత్మిక అరుణప్రభల చేత పిండాండ బ్ర్హహ్మాండములు నిండిపోయాయి అని. ఇక్కడ పిండాండం అంటే సాధకుడి శరీరమే. కుండలిని ఎర్రని ప్రభకలదని తాత్పర్యం. పిండాండ బ్రహ్మాండములకు ఏకత్వం చెప్తారు.

సౌందర్యలహరీ స్తోత్రంలో శ్రీశంకరులు

క్షితౌ షత్పఞ్చాషట్ ద్ద్విసమధిక పఞ్చాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశదనిలే
దివి ద్విష్షట్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగం.

అంటారు. ఈ శ్లోకం చాలా మనోహరమైనది. ఇక్కడ కుండలినికి ఉన్న 360 కిరణములను గురించి చెబుతున్నారు. ఈ 360 సంఖ్య సంవత్సరంలోని తిథులను తెలియజేస్తున్నది. అనగా శ్రీదేవి కాలస్వరూపిణి, సంవత్సరరూపిణి. ఆమె తేజః కిరణాలు 360న్నూ జగత్తును కాలమై నడుపుతున్నాయని స్థూలంగా తాత్పర్యం. ఇది బ్రహ్మాండరూపిణిగా అమ్మ యొక్క కాలస్వరూపం. పిండాండంలోని వివిధ చక్రాలకు వివిధ కిరణసంఖ్య ఉన్నది. అవి మొత్తం 360. కలిసి పిండాండాన్ని పాలిస్తున్నవి అని తాత్పర్యం. ఈ కాంతులన్నీ చైతన్యస్వరూపములు. ఈ విధంగా అమ్మ బ్రహ్మాండాలను తన తేజస్సులో ముంచెత్తుతున్నది అని అర్థం చేసుకోవాలి.

ఈ నామానికి సంబంధించిన కొన్నిమంత్రశాస్త్ర విషయాలున్నాయి. కాని అవి మనం ప్రస్తుతం చర్చించుకోవటం లేదు.