ఒకప్పుడు శ్రీదేవి తన భక్తులకు శ్రేయస్సును కలిగించాలన్న అభిలాషతో వశిన్యాది వాగ్దేవతలను తన సమ్ముఖానికి పిలిచింది.
వశిన్యాదులంటే అమ్మవారి పరివారదేవతలు. వాళ్ళపేర్లు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌళిని, సర్వేశ్వరి. వీళ్ళు మొత్తం ఎనిమిది మంది.
ఈ వశిన్యాదులు వాగ్దేవతలు. వర్ణమాలలొని అచ్చులకు అధిష్టానదేవత వశిని, హల్లుల్లో క-వర్గానికి అధిష్ఠానదేవత కామేశ్వరి, చ-వర్గానికి అధిష్ఠానదేవత మోదిని, ట-వర్గానికి అధిష్ఠానదేవత విమల, త-వర్గానికి అధిష్ఠానదేవత అరుణ, ప-వర్గానికి అధిష్ఠానదేవత జయిని, యరలవలకు అధిష్ఠానదేవత సర్వేశ్వరి, శషసహలకు అధిష్ఠానదేవత కౌళిని.
అంటే ఈవాగ్దేవతలు మనం పలికే ప్రతిమాటలోని ప్రతివర్ణాన్నీ శాసిస్తూ ఉంటారన్న మాట. మళ్ళా వీరంతా కూడా అమ్మవారు శ్రీదేవి శ్రీలలితాపరాభట్టారికా దేవికి పరివారదేవతలు.
ఈవాగ్దేవతలని పిలచి అమ్మావారు అందికదా, మీరంతా నాఅనుగ్రహంతో సకలవిద్యలనూ సంపదలుగా పొందారు. నా భక్తులకు కూడా సకలవిద్యాసంపదలూ కలగాలని నా ఆకాంక్ష.
మీ అందరికీ నా అనుగ్రహం వలన మా శ్రీచక్రరహస్యాలు చక్కగా తెలిసాయి. మీకు నా నామాలను చక్కగా తెలిసి పారాయణం చేయటంలో మంచి ఆసక్తి ఉంది.
అందుచేత ఆ నా నామాలతో ఒక మంచి స్తోత్రాన్ని నిర్మించే సమర్థత మీకు ఉంది.
కాబట్టి అటువంటి అందమైన స్తోత్రాన్ని నా గురించి రచించవలసిందిగా నా ఆజ్ఞ.
నా వేయి రహస్యనామాలను గిరించిన స్తోత్రం ఒకటి నాకంకితంగా రచించండి. ఏవిధంగా భక్తులు స్తోత్రం చేస్తే నాకు తక్షణమే అమితమైన ప్రీతి కలుగుతుందో అలాంటిది మీరు చేయండి.
వశిన్యాదులు అమ్మ ఆజ్ఞను విని చాలా ఆనందించారు.
అమ్మ కోరిన విధంగానే అమ్మవారి అతిరహస్యమైన వేయి నామాలనూ చక్కగా గుదిగుచ్చి అందమైన అద్భుతమైన స్తోత్రం రచించారు.
వారంతా శ్రీదేవి దర్శనానికి ఆస్తోత్రంతో సహా విచ్చేసారు.
అప్పుడు అమ్మ గొప్ప సభను తీర్చి సింహాసనం మీద ఆసీనురాలై ఉంది.
తన దర్శనం కోసం వచ్చిన బ్రహాది దేవతాసమూహానికి తనసభలోనికి రావటానికి అమ్మ అనుజ్ఞ ఇచ్చింది.
ఒక్క బ్రహ్మ కాదు.
ఒక్క విష్ణువు కాదు
ఒక్క రుద్రుడు కాదు.
అనేకానేక బ్రహ్మాండాల నుండి వాటిని పరిపాలిస్తున్న బ్రహ్మలూ విష్ణువులూ రుద్రులూ అందరూ తమతమ దేవేరులతోనూ తమతమ బ్రహ్మాండాలను పాలించే దేవతాగణాలతోను వచ్చి అమ్మ సభలో ఆవిడ అనుజ్ఞతో ఆసీనులై ఉన్నారు.
శోభాయమానమైన అమ్మసభలోఅమ్మ యొక్క మంత్రిణి శ్యామలాంబా దేవీ, అమ్మయొక్క దండనాయిక వారాహీదేవీ సభకు ఆధ్వర్యం వహించి ఉన్నారు.
అమ్మసభలో లెక్కకు మిక్కిలిగా ఉన్న అమ్మ అనుచరదేవీగణం అందరు శక్తిదేవతలూ ఆసీనులై ఉన్నారు.
అమ్మసహలో ఓఘత్రయం చక్కగా విరాజిల్లుతోంది.
ఓఘత్రయం అంటే బ్రహ్మాదిదేవతలను దివ్యౌఘం అంటారు, సనకాది దేవర్షిగణాలను సిధ్దౌఘం అంటారు, వ్యాసాది మానవలోక ఋషిగణాన్ని మానవౌఘం అంటారు. వీళ్ళందరూ అమ్మను చూడటం కోసం ఆవిడ అనుజ్ఞపొంది సభలో ప్రవేశించి కూర్చున్నారు.
అటువంటి మహాద్భుతమైన అమ్మ సభలోనికి వాగ్దేవతలు వశిని మొదలైన ఎనమండుగురూ వచ్చారు. అమ్మ ఆజ్ఞ చేసిన విధంగా వారు అద్భుతమైన సహస్రనామస్తోత్రాన్ని అమ్మపైన విరచించి తీసుకొని వచ్చారు.
వారిని చూసి అమ్మ చిరునవ్వు చిందించి, దయాపూర్ణమైన నేత్రాలతో వారిని తిలకించి మీరు రచించిన స్తోత్రం వినిపించండి అన్నట్లుగా కనుసైగతోనే ఆజ్ఞాపించింది.
వశిన్యాదులు ఉప్పొంగిపోయి, లేచి అమ్మకు తమమ చేతులు భక్తిపూర్వకంగ్సా జోడించి నమస్కరించారు.
తాము ఎంతో భక్తి వినయాలతో విరచించిన అమ్మవారి దివ్య రహస్య సహస్రనామ స్తోత్రాన్ని వీనుల విందుగా ఆ సభలో అందరి సమక్షంలో అమ్మకు వినిపించారు.
అమ్మ ఆ అందమైన స్తోత్రాన్ని విని ఆనందించింది.
సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు.
ఈస్తోత్రం ఇతఃపూర్వం ఎన్నడూ విన్నది కాదే!
ఎంత అద్భుతంగా ఉన్నదీ!
ఎన్నెన్ని రహస్యార్థాలను నిక్షేపించి వెలయించారో ఈస్తోత్రాన్ని!
ఎవరు చేసారో ఈ మహత్తర స్తోత్రరత్నాన్ని!
వారి మనఃస్థితిని అమ్మ గమనించింది. వారిపట్ల అనుగ్రహంతో విషయం వారికి ఇలా చెప్పింది.
ఓ దేవతలారా!
వినండి. ఈ ఉత్తమమైన స్తోత్రాన్ని ఈవశిని మొదలైన ఎనమండుగురే చక్కగా రచించి ఇప్పుడు వినిపించారు.
ఇంతగొప్ప స్తోత్రం వీరెలా చేయగలిగారో అంటారా?
దానికి మా సంకల్పమూ, వారికి మా అనుగ్రహమూ కారణం తప్ప మరేమీ లేదు.
ఇది చాలా చక్కగా ఉన్న స్తోత్రం.
మా మనస్సుకు ఎంతో నచ్చినది.
మీరు దీన్ని మా ఆజ్ఞగా పారాయణం చేయండి.
ఈ స్తోత్రపారాయణాన్ని ఆసక్తితో భక్తితో వినండి.
అంతేకాదు. మీరు మరొక పని కూడా చేయండి. మాపట్ల భక్తిగలవారికి దీనిని మీరు చక్కగా ఉపదేశం చేయండి.
అన్నివిధాలుగానూ ఈ సహస్రనామస్తోత్రాన్ని మీరు వ్యాప్తిచేయవలసింది.
దీని ప్రభావం వినండి.
ఏ భక్తుడైనా ఈ సహస్రనామస్తోత్రాన్ని ఒక్క సారి పారాయణం చేసినా సరే, అతడికి మా అనుగ్రహం ఉంటుంది. అటువంటి వాడికి నేను అన్ని కోరికలనూ తీరుస్తానని తెలుసుకోండి.
శ్రీచక్రాన్ని నా స్వరూపంగానే తెలుసుకొని, విధివిధానంగా శ్రీచక్రార్చన చేసి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపంచేసి, ఆ తరువాత ఈ సహస్రనామస్తోత్రాన్ని పారాయణం చేయాలి.
అందరికీ శ్రీచక్రార్చనకు ఉదదేశపూర్వకమైన అర్హత ఉండక పోవచ్చును కదా అనవచ్చును మీరు.
అందరికీ మంత్రోపదేశం ఉండకపోవచ్చును అన్నది కూడా నిజమేను.
ఐనా ఫరవాలేదు, అటువంటి వాళ్ళు శక్తిమేరకు నా సహస్రనామస్తోత్రం పారాయణం చేస్తే చాలు.
వారిపట్ల కూడా నాకు పూర్తిగా ప్రీతి కలిగి ఉంటాను. వాళ్ళ కోరికలు అన్నీ కూడా తీరుతాయి.
ఈవిషయంలో సందేహం అక్కరలేదు.
అందుచేత నా ఈ సహస్రనామస్తోత్రాన్ని మీరు చక్కగా ఎప్పుడూ పారాయణం చేయండి. వ్యాప్తిచేయండి.
ఇలాగున అమ్మ అక్కడ సభలో ఉన్న వారందరినీ ఉద్దేశించి అనుగ్రహభాషణం చేసింది.
అమ్మ ఆజ్ఞప్రకారం, అప్పటినుండి, శ్యామలాంబాదులూ, బ్రహ్మాది దేవతలూ ఋషులూ అందరూ అమ్మయొక్క సహస్రనామస్తోత్రాన్ని నిత్యమూ సంతోషంతో పారాయణం చేస్తున్నారు.
ఈ స్తోత్రం ముఖ్యంగా 'భక్తేన కీర్తనీయం' అని చెప్పబడింది. అంటే భక్తితో పారాయణం చేయాలి.
రిప్లయితొలగించండిశ్రీ మాత్రేనమః
ఇంత వివరంగా రాస్తున్నారు - చదివే సదవకాశం నాకు దొరికింది ధన్యోస్మి!
రిప్లయితొలగించండి